Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): ‘మా అధిష్ఠానం తెలంగాణ ప్రజల రూపంలో గల్లీలో ఉంటే.. కాంగ్రెస్ నేతల అధిష్ఠానం ఢిల్లీలో ఉంటుంది. వీళ్లు ఏది చేయాలన్నా ఢిల్లీకి గులాంగిరి చేయాల్సిందే. ఢిల్లీ దయాదాక్షిణ్యాలపైనే వీళ్ల భవిష్యత్ ఉంటుంది’ అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తరుచూ చెప్పే మాటలు అక్షరాలా నిజం అని నిరూపిస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ‘మీ దయ.. మా ప్రాప్తం’ అన్నట్టుగా టికెట్ల కోసం అధిష్ఠానం వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మూడు నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసినప్పటికీ టికెట్ల కేటాయింపు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు తమ వర్గాలకు టికెట్లు దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నట్టు సమాచారం.
స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే నాలుగుసార్లు భేటీ అయినా టికెట్ల పంచాయితీ తేలలేదు. ‘మీరు ఏమి చేయాలో మేము చెప్తాం.. మీరు అమలు చేయండి. అంతేగానీ సొంత తెలివి చూపించొద్దు’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకామాండ్ గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. టికెట్ల కేటాయింపు వ్యవహారంలో రాష్ట్ర నేతలను అధిష్ఠానం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని తెలుస్తున్నది. అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ రాష్ట్ర నేతలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని సమాచారం. అధిష్ఠానం ఏర్పాటుచేసిన స్క్రీనింగ్ కమిటీయే రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో అధిష్ఠానం ప్రకటించేవరకు వేచి చూడక తప్పదని ఢిల్లీలో మకాం వేసిన సీనియర్ నేతలు తమ అనుచరులను బుజ్జగించే పనిలో పడినట్టుగా తెలుస్తున్నది.
టెన్ జన్పథ్ ముందు బారులు
ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం కావాల్సిన నేతలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సోనియాగాంధీ నివా సం టెన్ జన్పథ్ ముందు క్యూ కడుతున్నారు. టికెట్ల కోసం కొందరు, ప్రత్యర్థి వర్గంపై ఫిర్యాదులు చేసేందుకు మరికొందరు, అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇంకొందరు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఢిల్లీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కొందరు నేతలు వయా బెంగళూరు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బెంగళూరు కేంద్రంగానే కథ నడిపిస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో, టికెట్ల కేటాయింపులో కర్ణాటక జోక్యం పెరగడం పలువురు కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. టికెట్ల కేటాయింపులో అధిష్ఠానం నాన్చివేత ధోరణి క్షేత్రస్థాయి నేతలను అహహనానికి గురిచేస్తున్నది. ప్రచారంలో వెనుకబడి పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ప్రతి పనికీ ఢిల్లీ వెళ్లే పరిస్థితి మారకపోతే ప్రజల్లో మరింత చులకన అవుతామని మదనపడుతున్నారు.
అధిష్ఠానం వద్ద తాడోపేడో తేల్చుకోవాలని..
రాష్ట్ర కాంగ్రెస్లో బీసీ టికెట్ల పంచాయితీ మరింత ముదిరింది. మొన్నటివరకు గాంధీభవన్ వేదికగా కొనసాగిన ఈ పంచాయితీ ఇప్పుడు ఢిల్లీకి చేరుతున్నది. టికెట్ల కేటాయింపులో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అధిష్ఠానం వద్దే తేల్చుకోవాలని భావిస్తున్న ఆ వర్గం నేతలు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీని కలిసి తమ డిమాండ్లు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాలు బీసీలకే ఇవ్వాలన్న డిమాండ్పై టీపీసీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ నిర్లక్ష్య వైఖరి కారణంగానే తామంతా ఢిల్లీని ఆశ్రయించాల్సి వస్తున్నదని బీసీ నేతలు చెప్తున్నారు.