Jajula Srinivas Goud | హైదరాబాద్ : బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో బీసీల ఊసేది..? బీసీలకు ఏది మోదీ గ్యారంటీ.? అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. బీసీలకు కావాల్సింది ఉచిత బియ్యం కాదు.. చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాజుల శ్రీనివాస్ గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ మేనిఫెస్టోలో దేశంలోని 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలు, డిమాండ్లు పేర్కొనకపోవడం చాలా అన్యాయమన్నారు. మోదీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీల ఊసే లేకపోవడం బీసీల పట్ల బీజేపీకి ఉన్న వ్యతిరేక వైఖరికి నిదర్శనం అని పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కుల, జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు, సమగ్ర కులగణన, ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోరుతుంటే.. ఇవేమీ పరిగణనలోకి తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఇంకో ఐదేండ్లు ఉచిత రేషన్ బియ్యం, మోదీ గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.
మోదీ గ్యారెంటీల పేరుతో 14 అంశాలను పొందుపరిచారు. కానీ దాంట్లో ఒక్కటి కూడా బీసీలకు సంబంధించి లేకపోవడం దారుణమన్నారు. పేరుకే బీసీ ప్రధానమంత్రి.. కానీ బీసీలకు ఈ పదేండ్లలో చేసిందేమీ లేదన్నారు. గతంలో మండల్ కమిషన్ ఉద్యమాన్ని బీసీలు ముందుండి నడిపిస్తే.. దానికి వ్యతిరేకంగా కమాండల్ ఉద్యమాన్ని ఇదే బీజేపీ తీసుకువచ్చింది. ఇప్పుడు మళ్లీ బీసీ ప్రధానమంత్రి పేరుతో రాజ్యాంగానికి విరుద్ధంగా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టిందని జాజుల తెలిపారు.
బీసీలకు కావాల్సింది రేషన్ బియ్యం, ముద్ర లోన్లు, సబ్సిడీ గ్యాస్ కాదు.. బీసీలకు కావాల్సింది సమగ్ర కులగణన, చట్టసభల్లో రిజర్వేషన్లు, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు, కేంద్ర బడ్జెట్లో వాటా కావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ పదేండ్లలో బీసీల గురించి పట్టించుకోని మోదీకి బీసీలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. నిజంగా బీజేపీకి, ప్రధాని మోదీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీ డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చి, బీసీ పాలసీని ప్రకటించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.