హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహిస్తున్నట్టు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యబట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్లో ప్రవేశం కోసం 58,113 మంది, డిగ్రీ కోసం 8,429 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 277 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు 69,147 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారికి వచ్చేనెల 10న 299 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. 2 నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.