ఖైరతాబాద్, ఏప్రిల్ 4: బీసీలు ఇప్పుడు మేల్కొనకపోతే వారికి ఉనికి ఉండదని, పోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జనగణనలో ‘ఓబీసీ కులాలకు తీరని అన్యాయం’ అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. బీసీలతో ఎంబీసీలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్లు, మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, బీసీలకు మాత్రం 42% అంటున్నారని, పైగా 50% సీలింగ్ పెట్టడం వల్ల కోర్టుల్లో కేసులు నిలబడటం లేదని వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుకు 80 ఏండ్ల వయసులో కూడా బీసీల కోసం పోరాడుతూనే ఉన్నారని కొనియాడారు. బీసీలకు హక్కులు అమలు చేయకుంటే తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. 1881లోనే కులగణన ప్రారంభమైందని, 1931లో బీసీల లెక్కలు తేల్చారని చెప్పారు.
ఆ తర్వాత 1948లో సెన్సెస్ యాక్ట్ను తయారు చేశారని, అయితే అప్పటి ప్రధాని నెహ్రూ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి బీజేపీ పాలన వరకు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2010లో పార్లమెంట్ సాక్షిగా జనగణనతోపాటు కుల గణన చేయాలని డిమాండ్ చేసిందని, కానీ నేడు అధికారంలో ఉన్నా అందుకు పూనుకోవడం లేదని దుయ్యబట్టారు.