టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అణచివేతకు గురైన వెనకబడినవర్గాలను టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ చేరదీసి వాటి ఎదుగుదలకు చేయూతనిస్తే, నేడు ఈ వర్గాల ఆర్థిక స్వాలంబనకు, రాజకీయ ఎదుగుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వేదికగా మారింది. ఇప్పటివరకు రాష్ర్టానికే పరిమితమైన బీసీ నాయకత్వం, సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ వారధిగా జాతీయస్థాయికి ఎదగాలని ఆశిస్తున్నది. తమ ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు రాష్ట్రంలో బీసీ నేతలంతా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బాట పట్టారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) :
మొన్న స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, అంతకుముందు బూడిద భిక్షమయ్యగౌడ్, పల్లె రవికుమార్ గులాబీ గూటికి చేరగా, త్వరలో రాపోలు ఆనంద భాస్కర్ తదితర నేతలు టీఆర్ఎస్లో చేరనున్నారు. గత వారం పది రోజులుగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరిన బీసీ ప్రముఖులు వారి సామాజికవర్గంలోనే కాకుండా సమాజంలోనూ మంచి పేరు ప్రతిష్ఠలతోపాటు రాజకీయంగా అపార అనుభవం కలిగినవారే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బీసీ నేతల్లో రాజకీయంగా తగిన గుర్తింపు లభించని, పైగా అణచివేతకు గురవుతున్న మరి కొందరు బీసీ ముఖ్యనేతలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వైపు చూస్తున్నట్టు సమాచారం. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా ఎదుగుదలకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీనే సరైన వేదికగా భావిస్తున్నారు.
రాపోలు ఆనంద భాస్కర్
రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ సీనియర్ జర్నలిస్ట్గా పత్రికారంగంలో సుపరిచితులు. మరోవైపు పద్మశాలి సామాజికవర్గంలో ప్రముఖుడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా, ఆ పార్టీ సంస్థాగత శిక్షణా శిబిరాల నిర్వాహకుడిగా జాతీయస్థాయిలో పేరున్నది. రాజకీయాల్లోకి రాకముందు తెలంగాణ రాష్ట్ర సాధనకు తనవంతుగా తెలంగాణ ప్రగతి వేదిక ద్వారా కృషిచేశారు. స్వల్పకాలంపాటు బీజేపీలో ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఏ మాత్రం ఇమడలేకపోయారు. కుల వృత్తులు, చేతి వృత్తులు అంతరించిపోయి జీవనాధారం కోల్పోయి బతుకే భారంగా మారిన క్రమంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడంతో కలత చెందారు. ఒకవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం కులవృత్తుల పునర్జీవనానికి పెద్దపీట వేస్తుండగా, మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ వృత్తులను నామరూపాలు లేకుండా చేయడానికి కంకణం కట్టుకోవడాన్ని సహించలేక పోయారు. ఇక ఎంత మాత్రం బీజేపీలో కొనసాగలేక, వెనకబడిన తరగతుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి కృషిచేస్తున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీనే తమకుసరైన వేదికగా భావించారు. త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి ఆసక్తి వ్యక్తంచేశారు.
దాసోజు శ్రవణ్
ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్.. పూర్వాశ్రమంలో టీఆర్ఎస్ నాయకుడే. పార్టీ అధికార ప్రతినిధిగా తెలంగాణ ప్రత్యేక వాదాన్ని బలంగా వినిపించిన నేత. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. కొంతకాలంపాటు కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేసిన దాసోజు శ్రవణ్.. ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాంగ్రెస్లో బడుగు, బలహీన వర్గాల నేతలు ఏవిధంగా అణవేతకు గురవుతున్నారో, అదే పరిస్థితి బీజేపీలోనూ కనిపించింది. కొద్ది రోజులకే బీజేపీ అసలు స్వరూపం బయటపడటంతో ఎంతో మంది బీసీ నాయకుల ఎదుగుదలకు కారణమైన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీయే తనకు సరైన వేదికగా భావించి తిరిగి గులాబీ కండువా కప్పుకొన్నారు.
భిక్షమయ్య, పల్లె రవికుమార్
బీజేపీలో దాసోజు శ్రవణ్కు ఎదురైన అనుభవాలనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తన లాంటి బీసీ నాయకులకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీయే సరైన వేదికగా భావించి ఇటీవల గులాబీ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడుకు చెందిన బీసీ నాయకుడు పల్లె రవికుమార్.. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. కొద్దికాలం కాంగ్రెస్లో కొనసాగినప్పటికీ అక్కడ తన లాంటి బీసీ నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేదన్నది అనుభవపూర్వకంగా తెలుసుకొని టీఆర్ఎస్లో చేరారు.
స్వామిగౌడ్
స్వామిగౌడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉద్యోగ సంఘాల నేతగా, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన స్వామిగౌడ్కు రాజకీయ అరంగేట్రం కల్పించింది టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీనే. తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి తొలి చైర్మన్గా అత్యున్నత అవకాశాన్ని కల్పించి పెద్దపీట వేసిందీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీనే. ఆయన బీజేపీలో చేరి.. అక్కడ ఇమడలేక తిరిగి గులాబీ కండువా కప్పుకొన్నారు.