హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు. దీనికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ సంఘీభావం తెలిపారు.
బీసీలకు ఉద్యోగాల్లో ఉన్న 27% రిజర్వేషన్ను 50 శాతానికి పెంచాలని కృష్ణయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చట్టసభల్లోనూ 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు సైతం ఇందుకు అనుకూలంగా ఉన్నదని చెప్పారు. కేంద్రంలో బీసీ ప్రధాన మంత్రి ఉన్నారని, కాబట్టి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.