కిషన్రెడ్డీ ఖబడ్దార్: ఎమ్మెల్యే
హరిప్రియానాయక్ హెచ్చరిక
బయ్యారం బస్టాండ్ సెంటర్లో
నేడు ఒకరోజు నిరసన దీక్ష
బయ్యారం, ఫిబ్రవరి 22: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కేంద్రప్రభుత్వ భిక్ష కాదని, తెలంగాణ ప్రజల హక్కు అని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. పరిశ్రమ కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని ప్రకటించారు. బయ్యారం లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ప్రజల చిరకాల స్వప్నమైన ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం దాటవేత ధోరణి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఫీజుబులిటీ కాదన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కిషన్రెడ్డి ప్రకటన తెలంగాణకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వ సంస్థలే అనేకసార్లు బయ్యారంలో సర్వే చేసి స్టీల్ ప్లాంట్కు అనువుగా ఉన్నదని ప్రకటించాయని గుర్తుచేశారు. దేశంలోని మొత్తం ఇనుప ఖనిజంలో 11% బయ్యారంలోనే ఉన్నదని, పరిశ్రమ వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే నడుస్తున్న స్టీల్ ప్లాంట్లకు రూ.71 వేల కోట్లు మంజూరు చేసిన కేంద్రం, బయ్యారం విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పుట్టిన మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ ద్రోహిలా మాట్లాడుతున్నారని, కిషన్రెడ్డీ ఖబాడ్దార్ అని హెచ్చరించారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం బయ్యారం బస్టాండ్ సెంటర్లో హరిప్రియానాయక్ బుధవారం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టనున్నారు.