Gruha Jyothi | మంగపేట, డిసెంబర్ 29: గృహజ్యోతి పథకం కింద ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు సౌకర్యం కోసం ఓ వృద్ధురాలు పాత మీటరుతో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ వద్దకు వచ్చి అధికారులను విస్మయానికి గురిచేసింది. ములుగు జిల్లా మంగపేట మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు పోలబోయిన బాయమ్మకు గుడిసె ఉండేది. కొద్ది సంవత్సరాల క్రితం అది కూలిపోగా పక్కనే మరో ఇల్లు కట్టుకున్నది. అందులో నివాసముంటున్నా కరెంటు మీటరు లేదు.
గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసేందుకు బాయమ్మ గురువారం ప్రజాపాలన గ్రామసభకువచ్చింది. ఆధార్ వివరాలతోపాటు, పాత గుడిసెకు చెందిన వినియోగంలో లేని ఓ మీటరు తీసుకురాగా.. ఆమె అమాయకత్వానికి అధికారులు విస్మయానికి గురయ్యారు. పాత మీటరుతో గృహజ్యోతికి దరఖాస్తు చేయడం వీలు కాదనడంతో తన ఇంటికి ఉచిత కరెంటు ఎట్లా? అని అమాయకంగా అక్కడే ఉండిపోయింది. అయితే పంచాయతీ కార్యదర్శి రాంబాబు ఆమెకు అవగాహన కల్పించి పంపించారు.