మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఆవరణలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 7.80 లక్షల రూపాయల విలువ చేసే బ్యాటరీ స్కూటీలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా ఉద్యోగాలలో రిజర్వేషన్ లతోపాటు, చదువులలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. అంతేగాక బ్యాంకుల ద్వారా దివ్యాంగులకు రుణాలను ఇవ్వడంతో పాటు, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద మహబూబ్ నగర్ జిల్లాలోని దివ్యాంగులకు ఒక్కొక్కటి లక్ష రూపాయల విలువ చేసే 6 బ్యాటరీ స్కూటీలు, ఒక్కొక్కటి 45 వేల రూపాయల విలువ చేసే 4 బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. దివ్యాంగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, జిల్లా మహిళా, శిశు సంక్షేమ,దివ్యాంగుల శాఖ అధికారిని రాజేశ్వరి ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.