హైదరాబాద్ : తెలంగాణలో గొప్పగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణులు బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది రూ. కోట్ల విలువ చేసే చీరలను పంపిణీ చేస్తున్నారు. వివిధ రకాల రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో చీరలను నెయించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళా సోదరిమణులకు భారీగా పంపిణీ చేస్తున్నారు.
ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ చీరలు భారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ ఏడాది రూ. 340 కోట్ల వ్యయంతో బతుకమ్మ చీరలను సిద్ధం చేశారు. 240 పైచిలుకు వెరైటీ డిజైనర్లతో చీరలు తయారుచేసి పంపిణీకి సిద్ధం చేశారు. ఒక కోటి 18 లక్షల చీరలను మహిళా సోదరిమణులకు పంపిణీ చేయడానికి టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలను వెండి, బంగారు, జరీ అంచులతో తయారు చేయించారు. రాష్ట్ర అవతరణ తర్వాత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రతి బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు రంగు రంగుల డిజైనలలో చీరలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చీరల పంపిణీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.