Hyderabad: బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మహిళలకు అందించే చీరలు ఈసారి మరింత అందాన్ని సంతరించుకున్నాయి. మొత్తం 19 రంగులు, 17 డిజైన్లతో 290 రకాల చీరలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని ఆయా జిల్లాకేంద్రాలకు కూడా పంపించేశారు. ఏటా బతుకమ్మ పండుగ సమయంలో మహిళలకు ప్రభుత్వం తరఫున చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది పంపిణీ సందర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించాలని కేటీఆర్ ఆదేశించారు.
ఈ మేరకు మహిళలకు అందించే చీరల్లో మార్పులు చేశారు. అక్టోబరు 6న బతుకమ్మ సందర్భంగా 2వ తేదీ కల్లా చీరల పంపిణీ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా రేషన్ షాపుల సమీపంలో చీరల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్త్నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,012 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఏటా ఈ చీరల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తుంది.
కానీ ఈసారి రూ. 318 కోట్లు వెచ్చించింది. ఈ చీరల పంపిణీ కార్యక్రమం గ్రామస్థాయిలో రేషన్ డీలర్లు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘ ప్రతినిధుల పర్యవేక్షణలో జరుగుతుంది. పట్టణాల్లో అయితే రేషన్ డీలర్లు, మున్సిపల్ బిల్ కలెక్టర్లు, మహిళా సంఘ ప్రతినిధులు చీరల పంపిణీని పర్యవేక్షిస్తారు. చీరలు తీసుకునే మహిళలు తమ వెంట ఆహార భద్రత కార్డు తీసుకొస్తే సరిపోతుంది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో చీరల పంపిణీపై స్పష్టత వచ్చింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక దష్ట్యా కరీంనగర్ హనుమకొండ జిల్లాల్లో చీరల పంపిణీపై అసందిగ్ధత ఏర్పడింది. ఎలక్షన్ కమిషన్ ను సంప్రదించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.