ములుగు: దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తూ వారు సగర్వంగా జీవించేలా సీఎం కేసీఆర్ చేస్తున్నారని వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరలను మంత్రి సత్యవతి పంపిణీ చేశారు. అంతకుముందు ములుగులోని గట్టమ్మ ఆలయంలో, తాడ్వాయిలోని మేడారం సమ్మక్క సారలమ్మలకు దర్శించుకుని అమ్మవార్లకు బతుకమ్మ చీరలను సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఏడాది బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.339 కోట్లు వెచ్చిస్తున్నది చెప్పారు. 10 రంగులు 18 డిజైన్లలో 200 రకాల చీరలను ఆడబిడ్డలకు అందిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ చీరలతో నేతన్నల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు.
రాజకీయ లబ్దికోసం ప్రతిపక్ష నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా ప్రశ్నించారు. దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు దోచి పెట్టడానికి కేంద్రం కంకణం కట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ గురించి గానీ, ఇక్కడి పరిపాలన గురించి గానీ మాట్లాడే నైతిక హక్కు విపక్షాలకు లేదన్నారు.