రాజన్న సిరిసిల్ల, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్: ‘నేతన్న పొట్టగొడితే ఊరుకునేది లేదు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, పెండింగ్లో ఉన్న బకాయిలు ఈ నెల 14లోపు చెల్లించాలి. లేదంటే 15న సిరిసిల్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మంది నేతన్నలతో కలిసి మహాధర్నా నిర్వహిస్తాం’ బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత సిరిసిల్ల పవర్లూం కార్మికులకు బతుకు దెరువు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్తోపాటు రాజీవ్ విద్యామిషన్ ద్వారా స్కూల్ యూనిఫారాల తయారీ ఆర్డర్లు ఇచ్చిందని అన్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా నేతన్నల పొట్టగొడుతున్నదని మండిపడ్డారు. గతంలో తయారు చేసిన బతుకమ్మ చీరలు, రాజీవ్విద్యామిషన్ వస్ర్తాల తయారీకి సంబంధించి రూ.200 కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో యజమానులు, ఆసాములు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ‘కత్తెర పెడతాం.. పేగులు మెడలో వేసుకుంటాం’ అని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డి మాట్లాడటం పద్ధతి కాదని హితవు పలికారు. నేతన్నల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే 15న చేపట్టే ధర్నాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు వేలాది మంది నేతన్నలు పాల్గొంటారని తెలిపారు. రేవంత్రెడ్డిది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. తెచ్చిన అప్పులు కట్టలేక ప్రభుత్వం పైసలివ్వక పోవడం వల్ల సాంచాలు బంద్పెట్టారని తెలిపారు. నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్ జోలె పట్టి చందాలు పోగు చేసి రూ.50 లక్షలు పద్మశాలీ ట్రస్టుకు అందించారని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేత కార్మికులకు రూ.3,400 కోట్ల ఆర్డర్లు ఇచ్చినట్టు చెప్పారు.