హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగను విదేశాల్లో తెలంగాణ ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆడబిడ్డలు ఆడిపాడారు. ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా ఆధ్వర్యంలో ఉగాండా రాజధాని కంపాలాలో ఆదివారం స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో బతుకమ్మ పండుగను సంబురంగా నిర్వహించారు. రెండు గంటలపాటు బతుకమ్మ ఆడిన అనంతరం సమీపంలోని కొలనులో నిమజ్జనంచేశారు. కెనడాలోని హాలిఫ్యాక్స్ నగరంలో బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచులంతా స్థానిక కమ్యూనిటీ సెంటర్లో ఎనిమిది అడుగుల ఎత్తు బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మలేషియాలో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. మలేషియా టీఆర్ఎస్ అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఖతర్లోని ఫుట్బాల్ స్టేడియం వద్ద జరిగిన ఈ వేడుకలకు జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నంది అబ్బగౌని నేతృత్వం వహించారు. ఈ వేడుకలకు ఖతర్లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, అతని సతీమణి అల్పన మిట్టల్ హాజరయ్యారు. ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో చిన్నారులు, మహిళలు బతుకమ్మ ఆడారు. వీరందరికీ వీడియో సందేశం ద్వారా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఐసీబీఎఫ్ అధ్యక్షుడు వినోద్నాయర్, ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బెగె, ప్రధానకార్యదర్శి కే కృష్ణకుమార్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ కోడూరి, ఐసీబీఎఫ్ ఎంసీ రజినీ మూర్తి పాల్గొన్నారు.