హైదరాబాద్: ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేపప్రసాదాన్ని (Fish Prasadam) పంపిణీ చేయడంలేదని నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్ తెలిపారు. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వ సహాయంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వివిధ ప్రాంతాల ఆస్తమా రోగులకు ఉచితంగా చేపప్రసాదాన్ని అందించామన్నారు. ఈ ఏడాది సైతం కరోనా నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా ప్రభుత్వం చేపప్రసాదం పంపిణీకి అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసిందని చెప్పారు. ఆస్తమా రోగులు చేపప్రసాదం కోసం హైదరాబాద్కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
మృగశిర కార్తె రోజున చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి దేశ, విదేశాల నుంచి కూడా అస్తమా రోగులు హైదరాబాద్ వచ్చేవారు. అయితే కరోనా కారణంగా గత గత మూడేండ్లుగా చేప మందును పంపిణీ చేయడంలేదు. కరోనా నిబంధనలు అమల్లో ఉండటంతో ఈసారి కూడా ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది.