హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో 350 కొత్త బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో నగరంలోని బస్తీల్లో వైద్య సౌకర్యాలేవీ అందుబాటులో ఉండేవని కావని, పేదలు విధి లేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుప్రతులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం నగరంలో 256 బస్తీదవాఖానాలు సేవలందిస్తున్నాయని, వీటిలో వైద్యసేవలతో పాటు 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని మంత్రి తెలిపారు. తమ ముంగిట్లోకి ఆసుపత్రులు రావడంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, చీటికి మాటికి ప్రైవేటు ఆసుపత్రులకు వెళాల్సిన బెడద తప్పిందని సంతోషపడుతున్నారని చెప్పారు. హెచ్ఎండీ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించిందని చెప్పారు.
నగరంలో బస్తీ దవాఖానాలకు వస్తున్న స్పందనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలకు కొత్తగా ప్రారంభించనుందన్నారు. బస్తీ దవాఖానాలు అందిస్తున్న సేవలను గుర్తించిన 15వ ఆర్థిక సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించిందన్నారు. ఈ తరహా దవాఖానలు ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించిందన్నారు. వైద్యసేవలపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందన్నారు. వైద్యసేవల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చు రూ.1698 అని తెలిపారు. ఆరోగ్యరంగంలో అత్యధికంగా తలసరి ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదన్నారు.
ప్రభుత్వం రాష్ట్రంలోని దవాఖానాలన్నింటిలో మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుందని, వైద్య పరీక్షల పరికరాలు, మందుల తదితర సౌకరాలన్నింటినీ అందుబాటులోకి తెచ్చిందన్నారు. అన్నిజిల్లా కేంద్రాల్లో ‘తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు’ ఏర్పాటు చేసిందని, ఈ కేంద్రాల్లో 57కుపైగా పరీక్షలను ఉచితంగా చేస్తున్నాయన్నారు. కిడ్నీ రోగులకు వైద్యంకోసం రాష్ట్రంలో 42 ఉచితడయాలసిస్ కేంద్రాలను, వాటిలో 313 డయాలసిస్ మిషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా కేంద్రాలకు వచ్చేపోయడానికి రోగులకు ఆర్టీజీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందని, రాష్ట్రంలోని 14 ఆసుపత్రుల్లో 14 చోట్ల సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్లో ‘క్యాథ్ల్యాబ్’ సేవలు అందుబాటులోకి వచ్చాయని.. ఆయా ల్యాబ్లలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని హరీశ్రావు తెలిపారు.
అలాగే ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలని, ఇందు కోసం డైట్ చార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్థకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కంటికి ఇచ్చే డైట్ చార్జీలను రూ.56 నుంచి రూ.112 పెంచాలని, సాధారణ రోగులకు ఇచ్చే చార్జిని రూ.40 నుంచి రూ.80కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందు కోసం ప్రభుత్వం ఏటా రూ.43.5కోట్లు ఖర్చు చేయనుందన్నారు. హైదరాబాద్ నగరంలోని 18 మేజర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగితో ఉండే సహాయకులకు సైతం సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిందని చెప్పారు. రెండు పూటలా భోజనం అందుతుందుందని, ప్రతి రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం అందుతుందని అంచనా వేస్తున్నామని, ఇందుకు ఏడాదికి రూ.38.66కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి వివరించారు.