బాన్సువాడ టౌన్, డిసెంబర్ 11: బస్తీ దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ చావిడి వద్ద రూ.13 లక్షలతో నిర్మించిన భవనంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఆదివారం ఆయన కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణానికి రెండు బస్తీదవాఖానలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ప్రతి చిన్నదానికి ఏరియా దవాఖానకు వెళ్లకుండా, వారికి అందుబాటులో ఉండటానికి వీలుగా బస్తీదవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. ఇక్కడ వైద్య పరీక్షలు, చికిత్స, అవసరమైన మందులు అన్ని ఉచితంగా అందిస్తారని తెలిపారు. దవాఖానలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మంచి చేస్తే ఓర్వలేక ఆరోపణలు
మంచిని కూడా జీర్ణించుకోలేని రాజకీయ నాయకులు కూడా ఉన్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.