కామారెడ్డి : మంజీర నదిపై చెక్ డ్యాంల నిర్మాణం.. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు వరంగా మారనుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. మంజీర నదిపై నిర్మిస్తున్న చెక్ డ్యాంలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..చెక్ డ్యాం ల నిర్మాణంతో మంజీర నది సంవత్సరం పొడవునా నీళ్లతో నిండుగా ఉంటుందన్నారు.
నది నుంచి ఇరువైపులా కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ జలాలు పెరిగి వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. బాన్సువాడ పట్టణ సమీపంలోని చింతల నాగారం వద్ద రూ. 15 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఎగువ నుంచి భారీ వర్షాలు, వరదలు వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరిచిన సమయంలో తప్పా.. దిగువ మంజీర నదిలో నీళ్లు ఉండేవి కావన్నారు. మంజీర నదిపై బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఆరు చెక్ డ్యాం లు నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.