హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న కిసాన్ క్రెడిట్ కార్డుల(కేసీసీ) కథ అంతా ఉత్తదే అని తేలిపోయింది. కేంద్రం చెప్పుకొంటున్నంత గొప్పగా రైతులకు కేసీసీలు అందడం లేదు. వాటి ద్వారా కలిగే ప్ర యోజనాలకు రైతులు దూరమవుతున్నారు. లేని కిసాన్ కార్డులకు లింకు పెట్టి రైతులకు రు ణాలు ఇస్తామంటూ కేంద్రం గొప్పలు చెప్పుకొంటున్నదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది రైతులు ఉంటే వారిలో 2.5 కోట్ల మంది రైతులకు మాత్రమే కేసీసీలు ఉన్నాయి. తెలంగాణలో ఒక్క రైతుకు కూడా ఆ కార్డు ఇచ్చిన దాఖలా లేదు. బ్యాంకులపై ఒ త్తిడి తెచ్చి రైతులకు కేసీసీలు అందించాల్సిన కేంద్రం గప్చుప్ ఉండిపోవడం గమనార్హం.
కేసీసీ ఉంటే 30 శాతం అదనపు రుణం
కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే రైతులు పంట లోన్లపై అదనంగా 30శాతం వరకు రుణాలు పొందొచ్చు. ఇందులో 10 శాతం ఇంటి ఖర్చుల కోసం ఇస్తారు. మిగిలిన 20శాతం రైతులు ఉపయోగించే పనిముట్లు, ఇతర వస్తువుల మెయింటెనెన్స్ కోసం అందిస్తారు. ఆ రుణాన్ని రైతులు తమకు అవసరమైనప్పుడు అవసరమైనంత వరకు మాత్రమే తీసుకోవచ్చు. ఎంత డబ్బు ఎప్పుడు తీసుకుంటే అప్పటి నుంచే వాటికి వడ్డీ పడుతుంది. కానీ సాధారణ విధానంలో అయితే మొత్తం రుణం ఒకేసారి ఇచ్చి.. మొదటి రోజు నుంచే వడ్డీ వేస్తారు. అదేవిధంగా రుణం రెన్యువల్ కోసం ప్రతి యేటా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రైతులు డబ్బులు చెల్లిస్తే అటోమేటిగ్గా రెన్యూవల్ అవుతుంది. ఈ కార్డు ఐదేండ్ల వరకు పనిచేస్తుంది.
లేని కార్డులకు రుణాలంటూ గొప్పలు
దేశంలో మెజార్టీ రైతులకు కిసాన్ కార్డులే లేవు. అయినా కేంద్రం కేసీసీ ద్వారా రైతులకు రుణాలు ఇస్తున్నామంటూ గొప్పులు చెప్పుకుంటున్నది. కేసీసీ గల 2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేస్తామని ఏడాది క్రితం కేంద్రం ఆర్థికశాఖ మంత్రి నిర్మల ప్రకటించారు. మరో 25 లక్షల మంది రైతుల కు, మత్స్యకారులకు కూడా కేసీసీలు జారీ చేస్తామని చెప్పారు. కానీ, ఏ హామీ నెరవేరలేదు. క్రాప్లోన్లనే కేసీసీ లోన్లుగా కేంద్రం చెప్పుకుంటుండటం గమనార్హం. బీజేపీ ప్రభుత్వం వచ్చాక సుమారు 4 లక్షల మంది రైతులకు రుణాలు తగ్గించడం గమనార్హం. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2014-15లో 7.41 కోట్ల మంది రైతులకు రుణాలు అందితే 2021లో అది 7.37 కోట్ల మందికే పరిమితమైంది.