హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారమే స్వయం సహాయక బృందాల(ఎస్హెచ్జీ) రుణాలకు వడ్డీరేట్లు అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు బ్యాంకర్లను ఆదేశించారు. అధిక వడ్డీలు వసూలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా ఎస్హెచ్జీలకు నెలరోజుల్లో తిరిగి చెల్లించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి హరీశ్రావు అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 35వ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. రూ.3 లక్షలలోపు రుణాలకు 7%, రూ.3 నుంచి 5 లక్షల వరకు 10% వడ్డీరేటు అమలు చేయాలని స్పష్టంచేశారు. కానీ, బ్యాంకులు మారిన వడ్డీరేట్లు అమలు చేయడం లేదని, దీనివల్ల ఎస్హెచ్జీలు, ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అన్ని బ్యాంకులు తక్షణం ఆర్బీఐ నిబంధనలను అనుసరించాలని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో అధికంగా వసూలు చేసిన వడ్డీని ఎస్హెచ్జీలకు తిరిగి చెల్లించాలని సూచించారు.
వడ్డీల్లో సెర్ప్ సిబ్బందికి వాటా ఇవ్వాలి
బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్, పోర్ట్ఫోలియో, మెయింటెనెన్స్ వంటి సేవల పేరుతో రూ.500 నుంచి రూ.5,000 వరకు చార్జీలు వసూలు చేస్తున్నాయని హరీశ్రావు పేర్కొన్నారు. మొబిలైజేషన్, ఎంసీపీ ప్రిపరేషన్, డాక్యుమెంటేషన్, మానిటరింగ్, రికవరీ వంటి సేవలను సెర్ప్ సిబ్బంది నిర్వహిస్తున్నారని, అలాంటప్పుడు బ్యాంకులు ఎస్హెచ్జీల రుణాలకు చార్జీలు ఎలా వసూలు చేస్తాయని ప్రశ్నించారు. బ్యాంకర్లు వడ్డీల్లో కొంత భాగం విలేజ్ ఆర్గనైజర్లు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలకు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే మెదక్ డీసీసీబీ బ్యాంకు వడ్డీలో 5% ఇచ్చేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నదని వెల్లడించారు. ఒకే బ్యాంకు వేర్వేరు బ్రాంచీల్లో వేర్వేరుగా రుణాలపై వడ్డీలు, ప్రాసెసింగ్ ఫీజులు తీసుకోవడం సరికాదని చెప్పారు. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.
ఆయిల్పాంకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి
విద్య, వైద్యం, గృహ సంబంధ, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో రుణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి హరీశ్రావు సూచించారు. డెయిరీ, ఫిషరీస్ సంబంధిత రుణ దరఖాస్తులు తిరస్కరించొద్దని, అర్హులకు తప్పనిసరిగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఆయిల్పాం సాగుకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనికి అధికంగా రుణాలు ఇవ్వాలని సూచించారు. ఎంఎస్ఎమ్ఈ పరిశ్రమలకు రుణాల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. బ్రిడ్జి లోన్ల మంజూరులో ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సమీక్షలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేబాశిష్మిత్రా, ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్ అమిత్ జింగ్రాన్, నాబార్డ్ సీజీఎం చింతల సుశీల, ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్ చక్రవర్తితోపాటు అన్ని బ్యాంకుల ప్రతినిధులు, రైతులు, చిన్న పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.