హైదరాబాద్: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె (strike) రెండో రోజూ కొనసాగుతున్నది. బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కుట్రలు చేస్తున్నదని, వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఉద్యోగ సంఘాలు చేస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకులతోపాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో గురు, శుక్రవారాలు బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి.
దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటున్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్తో సహా తొమ్మిది యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.