హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితో వారి సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు.
శనివారం బంజారా హిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి ఎర్రబెల్లిని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో పారిశుద్ధ్య కార్మికుల జేఏసీ నాయకులు కలిసి, వినతి పత్రం అందజేశారు. వర్షాకాలం దృష్ట్యా వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి సూచించారు. గతంలో ఎన్నడు లేని విధంగా, ఎవరూ అడగకముందే కేసీఆర్ వేతనాలు పెంచారని మంత్రి గుర్తు చేశారు. దరఖాస్తు పెట్టుకోకున్నా.. సమ్మెలు, ధర్నాలు చేయకున్నా.. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో వేతనాలు పెంచిన విషయాన్ని వివరించారు. వెంటనే సమ్మె విరమించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి చర్చలు జరుపుతారని చెప్పారు.