హైదరాబాద్, నవంబరు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలను తమ దేశంలో అమలుచేస్తామని బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రకటించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని, అమలు తీరు బాగున్నదని ప్రశంసించింది. బంగ్లాదేశ్కు చెందిన 13 మంది మేయర్లు, ముగ్గురు అధికారులు మొత్తం 16 మందితో కూడిన ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది. బుధవారం హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్లో ఉన్న సీడీఎంఏ కార్యాలయాన్ని సందర్శించింది. అక్కడ ఉన్న మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ను పరిశీలించింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పట్టణప్రగతిలో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సీడీఏంఏ ఎన్ సత్యనారాయణ వారికి వివరించారు. హరితహారం, బయోమైనింగ్, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, ద్రవ, ఘనవ్యర్థాల నిర్వహణ, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, ఎఫ్ఎస్టీపీల నిర్మా ణం, జనన, మరణ ధ్రువపత్రాల జారీ, పన్నుల విధానం తదితర అంశాల గురించి బంగ్లాదేశ్ బృందం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నది. పట్టణప్రగతి కింద చేపట్టిన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ తదితర కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయని బృంద సభ్యులు అభినందించారు.
బంగ్లాదేశ్లోనూ ఈ తరహా విధానాలను, సంస్కరణలను అమలు చేసి మరింత మెరుగైన పాలనను అందించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ చాలా బాగున్నదని, పట్టణాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే దగ్గర లభ్యం కావడం నిజంగా అభినందనీయమని ప్రశంసించారు. ఈ బృందంలో బంగ్లాదేశ్ మేయర్లు ఎండీ ఖలీద్ హుస్సేన్, జకియా కటూన్, ముషారఫ్ హుస్సేన్, ఖాజీ మహ్మద్ ఉల్ హాసన్, హజీ ఎండీ అబ్దుల్ఘనీ, అంజుమ్ అరా బేగం, నిర్మలెండ్ చౌదరి, మొహిద్దీన్ అహ్మద్, రఫీకా అక్తర్ జహాన్, పర్వేజ్ రహమాన్, రజుల్ కరీం, సయ్యద్ మోనిరూల్ ఇస్లాం, ఖుయ్యం జహాది తదితరులు ఉన్నారు.