హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రశంసల వర్షం కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మేయర్ల బృందం ప్రశంసించింది. బంగ్లాదేశ్కు చెందిన 13 మంది మేయర్లు, ముగ్గురు అధికారులతో కూడిన ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా మాసాబ్ ట్యాంక్లోని సీడీఏంఎ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను అధికారులు వారికి వివరించారు. అనంతరం సీడీఏంఎ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ను సందర్శించారు.
పట్టణ ప్రగతి కింద చేపడుతున్న కార్యక్రమాలను బంగ్లాదేశ్ మేయర్ల బృందానికి వివరించారు. బయో మైనింగ్, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలతో పాటు పలు కార్యక్రమాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకున్న బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశంసించారు. తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమం అద్బుతంగా ఉందని కొనియాడారు. బంగ్లాదేశ్ దేశంలోనూ ఈ తరహా విధానాలను, సంస్కరణలను అమలు చేసి మరింత మెరుగైన పాలనను అందించే విధంగా కృషి చేస్తామని మేయర్ల ప్రతినిధి బృందం ప్రకటించింది.