మహబూబ్నగర్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గురువారం ఏకంగా కాంగ్రెస్ కరపత్రాలను ఇంటింటికీ పంచారు. పార్టీ మారిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్నది. కాగా స్పీకర్ మాత్రం గద్వాల ఎమ్మెల్యే పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నాడని అనర్హత పిటిషన్లు కొట్టేశారు.
అప్పటి వరకు డైలమాలో ఉన్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ నాయకుడి అవతారం ఎత్తి మున్సిపల్ ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారానికి దిగుతున్నారు. కాంగ్రెస్ కరపత్రాలు పట్టుకుని హస్తం గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను అభ్యర్థిస్తున్న ఫొటోలు వైరల్గా మారుతున్నాయి. ఇప్పటికైనా స్పీకర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని.. ప్రజలు భావిస్తున్నారు. ఏ పార్టీయో చెప్పకుండా రాజకీయ వ్యభిచారిగా మారారని, కాంగ్రెస్లో మరో వర్గం సరితాతిరుపతయ్య ఘాటైన విమర్శలు చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కుమ్మక్కైన డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డిపై పీసీసీ చీఫ్నకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.