ఎల్కతుర్తి, ఫిబ్రవరి 28 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 80 రోజుల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు చేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజలే తిరగబడి కాంగ్రెస్ నాయకులను కొడతారని హెచ్చరించారు.
బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్, చింతలపల్లి, దామెర, ఎల్కతుర్తి, సూరారం, దండేపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రేషన్ కార్డులున్న వారికే గ్యారెంటీలను అందిస్తామని చెప్పడం సరికాదని, రేషన్ కార్డులే ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఓ కాంగ్రెస్ పెద్ద మనిషి అమ్మను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.