హైదరాబాద్, ఫిబ్రవరి 3 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిన్నది అరగక దీక్ష చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేసిందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వాడుకొన్నదని ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఎంపీలు వెంకటేశ్ నేతకాని, మాలోతు కవిత, మన్నె శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్పై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దేశ హితాన్ని, రాష్ర్టాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగ ప్రతిపాదన చేశారని వెంకటేశ్ నేతకాని అన్నారు. ఆ వ్యాఖ్యలపై బీజేసీ నేతలు సిగ్గులేకుండా దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జై భీమ్ దీక్షలు చేయటం సిగ్గుచేటు అని అన్నారు. బండి సంజయ్కు తెలంగాణపై ప్రేమ ఉంటే విభజన హక్కుల సాధనకు, సింగరేణి బొగ్గుబ్లాకుల వేలాన్ని ఆపేందుకు దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రాజ్యాంగం కావాలని అడిగితే, పాతది పడేయాలన్నట్టు కాదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేయటంలో విఫలం అయితే కొత్త రాజ్యాంగం రాసుకోవచ్చని అంబేద్కరే చెప్పారని పేర్కొన్నారు.
అంబేదర్ ఆశించిందే..: మాలోతు కవిత
సీఎం కేసీఆర్ ప్రతిపాదనలపై చర్చించకుండా బీజేపీ రాజకీయం చేస్తున్నదని ఎంపీ మాలోతు కవిత అన్నారు. బడ్జెట్లో సామాన్యులకు ఉపయోగపడేది ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ, అంబానీకి దేశ సంపద దోచిపెట్టేందుకు బడ్జెట్ను రూపొందించారని ఆరోపించారు. రాజ్యాంగం గురించి సీఎం కేసీఆర్ మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. అంబేదర్ ఆశించిందే కేసీఆర్ చేస్తున్నారని స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి రూ.1000 కోట్ల నిధులు తేవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ తెలంగాణ అంబేద్కర్: మన్నె శ్రీనివాస్రెడ్డి
శాంతియుతంగా తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్ తెలంగాణ గాంధీ అయ్యాడని, అంబేద్కర్ ఆశయ సాధనకు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని కలలు కంటున్న ఆయన తెలంగాణ అంబేద్కర్లా మారారని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశానికి మార్గదర్శనం చేస్తుందని చెప్పారు. పేదలు, రైతులకు ఏం కావాలో సీఎం కేసీఆర్కు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదని అన్నారు. దళితుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పాటుపడుతున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.