కొత్తపల్లి/సంగెం, ఏప్రిల్ 6 : బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కార్యకర్తలే తమ బలం.. బలగమని ఆయన స్పష్టం చేశారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. కరీంనగర్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా మరింత కష్టపడి పనిచేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంచుతానని తెలిపారు. తనను ఇంతలా ఆదరిస్తున్న కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనని చెప్పారు. తెలంగాణను అస్థిరపరిచేందుకు టీఎస్పీఎస్సీ, పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. సంగెం మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో వరంగల్ జిల్లా గీసుగొండలో గురువారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ పదోతరగతి పరీక్ష పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు బండి సంజయ్ కుట్రపన్నారని ఆరోపించారు. మోదీకి ప్రజాస్వామ్యం మీద గౌరవం, నమ్మకం ఉంటే బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఒక బద్మాష్, బండి బట్టేబాజ్ అని మండిపడ్డారు.
మోదీ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని, అతడికి పడని రాజకీయ పార్టీలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోగా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో బీజేపీ దద్దమ్మలు, కాంగ్రెస్ సన్నాసులను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిలదీయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్.. మోదీని నిలదీస్తే ఆయన కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు మరోసారి పట్టం కట్టాలని ప్రజలకు కడియం పిలుపునిచ్చారు.