సైనిక్ స్కూల్ కోసం చేసిందేమిటి?
చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్
కార్పొరేషన్, మార్చి 27: కరీంనగర్ ఎంపీ బండి సంజ య్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి తాను ఏమీ తేకపోయినా.. రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మంజూరు చేయించానని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఇప్పటికే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అప్పటి ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కృషితో రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ నిర్వహణ చేపట్టామని గుర్తుచేశారు. ప్రస్తుతం దానికి కేంద్రం నుంచి పీపీపీ పద్ధతి మం జూ రు మాత్రమే ఇచ్చారని ఆయన స్పష్టంచేశారు. ఆ మాత్రం దానికే బండి సంజయ్ గొప్పలు చెప్పుకొంటున్నాడని, కొత్తగా స్కూల్ ఏమైనా మంజూరు చేయించారా? అని ప్రశ్నించారు. గతంలో వినోద్కుమార్ త్రిపుల్ ఐటీ కోసం ప్రయత్నించారని, తీరా పక్క రాష్ర్టాలకు తరలిపోతుంటే సంజయ్ ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నూతనంగా కేంద్ర ప్రభుత్వానికి ఏం ప్రతిపాదనలు చేశారు? ఏం మంజూరు చేయించారో? ప్రజలకు చెప్పాలన్నారు. వరంగల్లో కూడా సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించిందని, దమ్ముంటే అక్కడ స్కూల్ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఫేక్ యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా మారారని ఎద్దేవా చేశారు.