హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో అనుమానితుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భోరుమని ఏడ్చారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడుతూ.. బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. బీఎల్ సంతోష్ గురించి సినిమా ైస్టెల్లో ఎలివేషన్ ఇచ్చారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ ఇన్నాళ్లూ బుకాయించిన బండి.. ఇప్పుడు బీఎల్ సంతోష్ను ఏదేదో చేస్తున్నారని హడావుడి చేశారు.
ప్రసంగం మధ్యలో బండి సంజయ్ ఏడ్చేశారు. ఈ సీన్ చూసిన తర్వాత నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. బీఎల్ సంతోష్ ప్రచారక్ అయినంత మాత్రాన చట్టానికి అతీతులా? అని ప్రశ్నించారు. విచారణకు రావాలని పిలిస్తే అవమానించినట్టు ఎలా అవుతుందని నిలదీస్తున్నారు. ఓవైపు తనను ఆదుకుంటాడనుకున్న బీఎల్ సంతోష్ కేసుల్లో ఇరుక్కుపోవడం, మరోవైపు అడ్వొకేట్ శ్రీనివాస్ను సిట్ వరుసగా విచారిస్తుండటంతో బండికి భవిష్యత్తు కండ్లముందు కనిపించినట్టున్నదని ఎద్దేవా చేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో మునిగిపోతుందని తలుచుకొని బండి కండ్లలో నీళ్లు తిరిగాయని అంటున్నారు. నోటీసులు వస్తేనే ఇలా ఉంటే.. అరెస్ట్ చేస్తే ఏందో పరిస్థితి.. బకెట్ దగ్గర పెట్టుకోవాలేమో అని ఓ నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శ్రీనివాస్ అరెస్ట్ అయితే ఆయన జాతకం ఎక్కడ బయటపడుతుందో అని ఏడ్చినట్టున్నాడని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
రాజకీయ లబ్ధి కోసం మతాల పేరుతో రెచ్చగొట్టినప్పుడు గుర్తుకురాలేదా? అని మరొకరు వ్యాఖ్యానించారు. బండి అనుచరుడు శ్రీనివాస్.. తనకు, బండి సంజయ్కి సంబంధం లేదని చెప్పడంపైనా విసుర్లు వేస్తున్నారు. ‘కొంపతీసి మళ్లీ తడిబట్టల తోటి గుడికి పోయి ప్రమాణం చేస్తవా ఏంది?’ అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు. బీఎల్ సంతోష్ దేశం కోసం పోరాడే సైనికుడేమీ కాదని, ఒక రాజకీయ నాయకుడని అలాంటి వ్యక్తికి నోటీసులిస్తే ఏడ్వటమేమిటని నిలదీస్తున్నారు. ఏడ్చే మగవాడిని నమ్మొద్దని ఒక నెటిజన్ అన్నారు. కన్నీళ్లతో ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారని మరో నెటిజన్ వ్యంగ్యంగా అన్నారు.