రైతు దీక్ష పేరుతో బీజేపీ దొంగ నాటకం
ముడి బియ్యంతో వచ్చే నష్టంపై మాటలేదు
అన్నదాతల నుంచి కనీస మద్దతు కరువు
వడ్లు కొనాలంటూ గోధుమల ఫొటోలు
హైదరాబాద్, ఏప్రిల్ 11 : రైతు దీక్ష పేరుతో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నేతలు చేపట్టిన నిరసన తుస్సుమన్నది. ఈ దీక్షలో సీఎం కేసీఆర్ను విమర్శించడమే తప్ప ఎక్కడా రైతులపై ప్రేమ కనిపించలేదు. మొత్తం వివాదానికి మూలకారణమైన ‘గ్యాప్ ప్రైస్’ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. యాసంగిలో పండే వడ్లను ఉడుకబెట్టకుండా ముడి బియ్యంగా మార్చితే క్వింటాకు సుమారు 17 కిలోల నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని (గ్యాప్ ప్రైస్) ఎవరు భరిస్తారన్నదానిపైనే వివాదం మొదలైన సంగతి తెలిసిందే. కేంద్రం తెలివిగా బాయిల్డ్ రైస్ తీసుకోబోం అంటూ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టివేసే కుట్ర చేసింది. దీనికి రాష్ట్ర బీజేపీ నేతలు నిస్సిగ్గుగా వత్తాసు పలుకుతున్నారు.
వివాదం మొదలైన నాటినుంచి ఇప్పటివరకు ఈ గ్యాప్ ప్రైస్పై ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలేదు. రైతులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం రాకుండా ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరించేలా ఒప్పిస్తామని హామీ ఇవ్వడం లేదు. సోమవారమైనా అలాంటి ప్రకటన వస్తుందని భావించినా నిరాశే ఎదురైంది. నష్టం భరించకపోతే కేంద్రమే నేరుగా వడ్లు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపైనా బీజేపీ నేతలు మాట్లాడలేదు.
‘కీలక’ నేతలు ఎక్కడ?
బీజేపీ దీక్షలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కీలక నాయకులమని చెప్పుకొనే యూట్యూబర్లు, ఇటీవల పార్టీలో చేరినవారెవరూ ఎక్కడా కనిపించలేదు. ‘ప్రతి గింజ కేంద్రంతో కొనిపించే బాధ్యత తీసుకుంటా’ అని అప్పట్లో గప్పాలు కొట్టిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి సోమవారం వచ్చి గ్యాప్ ప్రైస్పై, వడ్ల కొనుగోలుపై హామీ ఇస్తారని ప్రజలు భావించారు. కానీ నిరాశే ఎదురైంది. మరోవైపు బీజేపీ ధర్నాకు కనీస స్పందన కరువైంది. వేలల్లో కదలి వస్తారని, కదం తొక్కుతారంటూ సోషల్ మీడియాలో ఊదరగొడితే.. వందల్లో మాత్రమే వచ్చారు. పైగా వారంతా బీజేపీ కార్యకర్తలే. అయినా నిస్సిగ్గుగా ‘రైతులంతా కదం తొక్కారం’టూ బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నది. దీంతో ఇదంతా నాటకమని ప్రజలకు అర్థమయ్యింది.
బీజేపీ.. బన్గయా బఫూన్
కడుపులో లేంది కావలిచ్చుకుంటే వస్తదా అన్నట్టు రైతు దీక్ష పేరుతో బీజేపీ చేసిందంతా ఉత్త డ్రామా అని తేలిపోయింది. కొంగ జపం చేసినట్టు తూతూమంత్రంగా ధర్నా చౌక్లో కాసేపు నాటకం ఆడుదామనుకొని అడ్డంగా బుక్కైంది. రాష్ట్రమే వడ్లు కొనాలంటూ ధర్నా చేస్తూ.. ఫ్లెక్సీలపై మాత్రం గోధుమల ఫొటోలు పెట్టుకొన్నారు. దీంతో హీరో అవుదామనుకున్న బండి సంజయ్.. ప్రజల దృష్టిలో బఫూన్ అయిపోయారు. వడ్లకు, గోధుమలకు తేడా తెలియదా.. అసలు మీ పోరాటం వడ్ల గురించా? గోధుమల గురించా? అంటూ నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఉత్తరాదికి బానిసలని నిరూపించుకొన్నారని ఒకరంటే, డిజైన్ గుజరాత్లో చేసి పంపారేమో అని మరొకరు కామెంట్ చేశారు. ఒకరైతే ఏకంగా ‘గోధుమలు కొంటాం’ అంటూ ఓ ఫేస్బుక్ ప్రొఫైల్ను క్రియేట్ చేసేశారు. కల్లెం నవీన్ రెడ్డి అనే ఓ నెటిజన్ ‘వడ్లను హిందీలో గోధుమలు అంటారని కవర్ చేసే ప్రయత్నం చేసినా చేస్తాడు. ఫేక్ యూనివర్సిటీ గాళ్లతో ఇదే తలనొప్పి’ అని బీజేపీపై సెటైర్ వేశారు. ‘వెన్నెముక లేని నాయకత్వం, స్థానిక అంశాలపై స్పృహ లేని నాయకులు. ఎంతసేపూ తెలంగాణ ప్రజలను తీసుకెళ్లి జాతీయ నాయకత్వాల దొడ్లో కట్టేద్దామనుకునే యావ. మీ కంటే శిఖండి నయం’ అంటూ మల్లికార్జున్రెడ్డి అనే నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.