Bandi Sanjay : పోక్సో కేసులో నిందితుడైన తన కుమారుడి బండి భగీరథ్ (Bandi Bhageerath)ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎట్టకేలకు పోలీసులకు అప్పగించారు. ముందస్తు బెయిల్ను కోర్టు నిరాకరించడం.. లుకౌట్ నోటీసులతో హైదరాబాద్, కరీంనగర్లోని తన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయడంతో ఆయన శనివారం భగీరథ్ను సరెండర్ చేశారు. న్యాయవాదుల ద్వారా పోలీసు విచారణకు తన బిడ్డను తానే పంపించానని బండి పేర్కొన్నారు. చట్టంపై గౌరవంతోనే తాను భగీరథ్ను పోలీసులకు అప్పగించానని ఎంపీ తెలిపారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తన కుమారుడిని అప్పగించిన అనంతరం ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘సత్యమేవ జయతే. మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపైనున్న గౌరవంతో ఈరోజు అడ్వోకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను.
నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే.
మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే అతడిని నేనే స్టేషన్లో అప్పగిద్దామనుకున్నా. భగీరథ్ న్యాయవాదులను సంప్రదించి తన వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. ఆ ఆధారాలు చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెబుతున్నారు. అయితే.. ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం (మే 18) నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది’ అని సంజయ్ వెల్లడించారు.