హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష ఎందుకు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులతో వారు మాట్లాడారు.
బండి సంజయ్ దీక్ష రాష్ట్రానికి నిధులు ఇవ్వని కేంద్రం మీదా? లేకా కేంద్రం ఇవ్వకున్నా నిధులు ఇచ్చిన రాష్ట్రం మీదా? అనేదిద ఆయన తెలపాలని, ఆ తర్వాతే దీక్ష చేయాలని మంత్రులు తెలిపారు. పల్లె ప్రగతి 5 వ విడత కార్యక్రమానికి సమాయత్తంగా ఉండాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చూపుతున్న వివక్ష, కక్ష సాధింపు చర్యలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి రావాల్సిన 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్రం కావాలనే రెండు నెలలుగా రూ.1400 కోట్లు పెండింగ్ లో పెట్టిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేసిందన్నారు. కొందరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని వేదికల్లో, అన్ని స్థాయిల్లో, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ పల్లె ప్రగతి సందర్భంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు నిజానిజాలు తెలిసే విధంగా కార్యక్రమాలు, సోషల్ మీడియా ను వాడుకోవాలన్నారు.