మంచిర్యాల, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదాల పేరిట దౌర్జన్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిలదీసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్పై అక్రమకేసులను నిరసిస్తూ గురువారం బీఆర్ఎస్ చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో దుకాణాలు, వ్యాపార సముదాలు మూసివేసి స్థానికులు బంద్లో పాల్గొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ, మందమర్రి, భీమారం, జైపూర్, కోటపల్లి మండలాలు, లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్, శ్రీరాంపూర్, నస్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంతోపాటు తాండూర్, కాసిపేట, నెన్నెల మండల కేంద్రాల్లో బంద్ సంపూర్ణంగా పాటించారు.
బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా బంద్ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు నిరసనలు తెలపడం, ఆందోళనలు చేయడానికి అనుమతి లేదంటూ పలుచోట్ల పోలీసులు బీఆర్ఎస్ కార్యక్రమాలు అడ్డుకొనే యత్నంచేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో కొద్దిమందితోనే ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ ర్యాలీ సందర్భంగా పోలీసులు అనుమతి లేదంటూ వీడియోలు తీస్తూ కనిపించారు. బంద్ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి నస్పూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. భీమారం మండలంలో బంద్ పాటిస్తున్న వ్యాపారులపై పోలీసులు బంద్ పాటించొద్దని ఒత్తిడి తెచ్చారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు.. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఈక్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మద్య వాగ్వాదం జరిగింది.
బాల్క సుమన్ అక్రమ అరెస్టు నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కోర్టులో గురువారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు అడ్వకేట్లు తెలిపారు. పోలీసులు వేసిన కేసుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో రిమాండ్ చేయడం చెల్లదని చెప్పారు. ఇదే విషయంపై హైకోర్టుకు ఆశ్రయిస్తామని చెప్పారు. పోలీసులు సమర్పించిన పెన్డ్రైవ్లో ఆధారాలు లేవని తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను అనుసరించి అసలు ఈ కేసులో అరెస్ట్ చేయడానికి వీలులేదని వాదనలు వినిపించామని తెలిపారు. దీనిపై ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారోనని వేచి చూస్తున్నామన్నారు.