హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బండాప్రకాశ్ను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి సీఎం కేసీఆర్, మంత్రులు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందంగా ఉన్నదన్నారు. విద్యాధికుడిగా పేరు తెచ్చుకున్నారని, విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారని పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి, కష్టపడి మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నియ్యారని అభినందించారు.
విద్యార్థిగా ఉంటూనే పిన్న వయస్సులోనే మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ ఉద్ధండులపై భారీ మెజార్టీతో గెలుపొందారని గుర్తుచేశారు. సొంత సామాజికవర్గ ముదిరాజ్ల కోసం అహర్నిశలు కృషిచేశారని కొనియాడారు. బండా ప్రకాశ్ ఎన్నిక పట్ల ముదిరాజ్ సామాజిక వర్గంతోపాటు అందరూ సంతోషిస్తున్నట్టు తెలిపారు. కోకాపేటలో ముదిరాజ్ భవన నిర్మాణానికి విశేష కృషిచేయడమే కాకుండా ఎంపీ నిధుల నుంచి రూ.కోటి మంజూరుచేశారని గుర్తుచేశారు. రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలన్న తన పిలుపును మన్నించి, ఎమ్మెల్సీగా వచ్చారని చెప్పారు. ఆయన కాంక్షించిన తెలంగాణను సాకారం చేసుకొని, నేడు మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికవ్వడం శుభదినంగా అభివర్ణించారు.
సొంత రాష్ట్రం ఏర్పాటైతే ఈ ప్రాంత బిడ్డలకు మంచి అవకాశాలు దక్కుతాయనేందుకు బండా ఎన్నికే చక్కటి సంకేతమని సీఎం ఉద్ఘాటించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్ర ప్రజలకు సేవలందించాలని కోరారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో చక్కటి పాత్ర పోషించారని, రాబోయే రోజుల్లో బండా ప్రకాశ్ నేతృత్వంలో ఫలవంతమైన చర్చలకు శాసనమండలి వేదిక కావాలని ఆకాంక్షించారు. భగవంతుడు నిండు నూరేండ్ల ఆయుష్సు, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
సవ్యమైన పద్ధతిలో నడిపిస్తారు: కేటీఆర్
సీఎం పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టి, మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన బండా ప్రకాశ్కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ సమయంలో, ప్రభుత్వంలోనూ బండా ప్రకాశ్తో అంతా కలిసి నడిచామని గుర్తుచేసుకున్నారు. యువ ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశాలిచ్చి సభను సమర్థంగా నడపాలని ఆకాంక్షించారు. ఆయన అనుభవం, పరిజ్ఞానాన్ని వినియోగించి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సహా అందరికీ అవకాశాలివ్వాలని కోరారు. సద్విమర్శలకు అవకాశమిచ్చి, సవ్యమైన పద్ధతిలో సభను నడిపిస్తారని.. అంతటి సమర్థత బండా ప్రకాశ్కు ఉన్నదన్నారు. ముదిరాజ్ సామాజికవర్గ అభ్యున్నతి కోసం బండా ప్రకాశ్ కృషి చేశారని, ఇదే కృషి నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
జీవన్రెడ్డి సాబ్ రండి
మండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాశ్ బాధ్యతల స్వీకరణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఆయనను సీట్లో కుర్చోబెట్టేందుకు సీఎం కేసీఆర్ వెళ్తున్న సమయంలో ‘ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సాబ్.. రండి’ అంటూ సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పిలుపుతో జీవన్రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, కాటేపల్లి జనార్దన్రెడ్డి వెళ్లి బండా ప్రకాశ్కు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందజేసే సమయంలోనూ ‘జీవన్రెడ్డి గారికి బొకే ఇవ్వండి’ అని సీఎం కేసీఆర్ సూచించడంతో అక్కడే ఉన్నవారు బొకేలు అందజేశారు. మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, చామకూర మల్లారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, మండలి చీఫ్ విప్ భానుప్రసాద్రావు, కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మధుసూదనాచారి, వాణీదేవి, తాతా మధు, ఫారూక్ హుస్సేన్ ప్రసంగించి, శుభాకాంక్షలు తెలిపారు.