BJP | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): బీజేపీకి ‘లీకుల’ వ్యవహరం కొత్త తలనొప్పిగా మారింది. కొంతకాలంగా బీజేపీ నుంచి రోజుకొక వార్త లీకు రూపంలో బయటికి వస్తున్నది. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని, బండికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని బుధవారం మరో లీకు వచ్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్తోపాటు బండి సంజయ్ మీడియా ముందుకు వచ్చి దీనిని ఖండించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేతల మదిలో ‘ఈ లీకులు చేస్తున్నది ఎవరు?’ అనే ప్రశ్నే మెదులుతున్నది. ఈ లీకుల వెనుక ఈటల రాజేందర్ ఉన్నారని ఆరెస్సెస్ వాదులు, నిజమైన బీజేపీవాదులు అనుమానిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలను వివరిస్తున్నారు. గతంలో బీజేపీలో లీకుల సంస్కృతి లేదని, ఈటలపై భూ ఆక్రమణ కేసులు నమోదైనప్పటి నుంచే ఈ వ్యవహారం మొదలైందని విశ్లేషిస్తున్నారు.
ఈటల బీఆర్ఎస్ను వీడుతారని, బీజేపీలో చేరుతారని.. ఇలా లీకుల పరంపర కొనసాగిందని చెప్తున్నారు. ఈటల బీజేపీలో చేరి, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత వ్యవహారం మరింత ముదిరిందని అంటున్నారు. అధ్యక్ష పదవిపై కన్నేసిన ఈటల.. తరుచూ లీకులు ఇస్తున్నారని భావిస్తున్నారు. బండిని దించేస్తారని, ఈటలకు పగ్గాలు అప్పగిస్తారంటూ పుకార్లు పుట్టించారని ఆరెస్సెస్ వాదులు చెప్తున్నారు. పదవి ఇచ్చే అవకాశం కనిపించకపోవడంతో ‘ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరతారు’ అంటూ కొత్త ప్రచారం మొదలైందని, ఈ నేపథ్యంలోనే చేరికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని వివరిస్తున్నారు. ఆ పదవిలో విఫలం కావడంతో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి.. బండి సంజయ్ అసమర్థుడని, మారుస్తారని పదేపదే ప్రచారం చేయించారని మండిపడుతున్నారు. దీంతో ఎన్నికలకు బండి నేతృత్వంలో వెళ్తామని తరుణ్చుగ్ స్పష్టత ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. దాని తర్వాతైనా లీకులు ఆగుతాయని భావించామని, కానీ.. మళ్లీ ఈటల కేంద్రంగానే ‘ఎన్నికల నిర్వహణ కమిటీ’ లేదా ‘ప్రచార కమిటీ’ బాధ్యతలు అప్పగిస్తారంటూ కొత్త కథనాలు మొదలయ్యాయని చెప్తున్నారు.
బీజేపీ చానల్లో ఈటల వార్తలపై నిషేధం?
ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, అమిత్షాతో భేటీలో ఏం మాట్లాడుకున్నారో బయటికి రావడంతో వీటి వెనుక కచ్చితంగా ఈటలే ఉన్నారన్న అనుమానం బలపడుతున్నదని బీజేపీ వాదులు అంటున్నారు. ఢిల్లీలో మొత్తుకున్నా ఫలితం కనిపించకపోవడంతో..బండి సంజయ్ని లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు కొత్త ప్రచారానికి ఒడిగట్టారని మండిపడుతున్నారు. మరోవైపు బీజేపీకి బాగా అనుకూలంగా ఉన్న ఒక టీవీ చానల్లో ఈటల రాజేందర్ వార్తలపై నిషేధం విధించినట్టు తెలుస్తున్నది. ఈటల పార్టీ మారుతారని బలమైన సంకేతాలు ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరెస్సెస్ వాదులు విశ్లేషిస్తున్నారు.