Congress | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి తెరలేచింది. రాష్ట్ర రాజకీయాల్లో ఢిల్లీ లాబీయింగ్ ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు రాత్రికి రాత్రి మారిపోవడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ‘మీరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు’ అంటూ మంగళవారం అధిష్ఠానం నుంచి అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు ఫోన్లు వచ్చాయి. కానీ, బుధవారం మధ్యాహ్నానికే సీన్ మారిపోయింది.
అద్దంకి దయాకర్ స్థానంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ మహేశ్కుమార్గౌడ్ను అధిష్ఠానం ఎంపిక చేసింది. మరో అభ్యర్థి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు కూడా రెండు రోజుల క్రితమే అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ పరిణామాలే రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకునే నిర్ణయాలకు సైతం అధిష్ఠానం వద్ద విలువ ఉండదని తేలిపోయిందని ఆ పార్టీ నేతలు నిట్టూరుస్తున్నారు.
చివరి నిమిషంలో చక్రం తిప్పిన అధిష్ఠానం?
ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడంతో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అసెంబ్లీలో తగిన మెజార్టీ కలిగిన అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లే ముందు ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలిసి మహేశ్కుమార్గౌడ్, అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. ఇందుకు అధిష్ఠానం నుంచి గ్రీన్సిగ్నల్ లభించిందంటూ సీఎం తన సన్నిహితులకు సమాచారమిచ్చారు. అయితే సీఎం విదేశీ పర్యటనకు వెళ్లిన తరువాత ఢిల్లీలో సీన్ మారిపోయింది.
సీఎం ప్రతిపాదించిన అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తూ, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ జోక్యంతో మహేశ్కుమార్గౌడ్ స్థానంలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ మంగళవారం అద్దంకి దయాకర్, వెంకట్కు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్టు సమాచారం.
ఒక్కో అభ్యరిని పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధిష్ఠానం అప్పగించింది. దీంతో ప్రతిపాదించే ఎమ్మెల్యేలను ఆయన బుధవారం సీఎల్పీ కార్యాలయానికి పిలిపించి వారితో సంతకాలు కూడా చేయించారు. గురువారం నామినేషన్లు దాఖలు చేయడానికి రంగం సిద్ధంచేశారు. అయితే, బుధవారం మధ్యాహ్నం చివరి నిమిషంలో అద్దంకి దయాకర్కు బదులు మహేశ్కుమార్గౌడ్ను అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. దీంతో పార్టీ వర్గాలు ముఖ్యంగా అద్దంకి దయాకర్, ఆయనకు మద్దతు ఇచ్చిన సీఎం సన్నిహిత వర్గాలు కంగుతిన్నాయి.
అద్దంకిని అడ్డుకున్నదెవరు?
అద్దంకి దయాకర్ మొదటి నుంచి రేవంత్రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడ్డారు. దీంతో నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మొదటి నుంచి అద్దంకి దయాకర్ను వ్యతిరేకిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన అద్దంకిని సొంత పార్టీ నేతలే ఓడించినట్టు ఆరోపణలొచ్చాయి. తన ఓటమికి పార్టీ నేతలే కారణమని అప్పట్లో అద్దంకి బాహాటంగానే ఆరోపించారు.
బహిరంగ సభా వేదికపైనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తీవ్రపదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్కు పార్టీ టికెట్ దక్కలేదు. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీగా అవకాశం లభిస్తుందని ఆయన ఆశించారు. అందుకు తగ్గట్టుగానే తొలుత అధిష్ఠానం ఆయనకు అవకాశం ఇవ్వాలని భావించింది. చివరి నిమిషంలో అద్దంకి అభ్యర్థిత్వాన్ని మార్చడం వెనుక ఆయనను వ్యతిరేకించే నాయకుని హస్తం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే బయటికి మాత్రం తన అనుచరులు ఎవరూ నిరాశ చెందవద్దని, ఎమ్మెల్సీగా అవకాశం దక్కకున్నా అంతకంటే మంచి అవకాశం లభిస్తుందన్న ఆశాభావాన్ని అద్దంకి దయాకర్ వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రహసనం మున్ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు అద్దం పడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇవ్వడంతో అసెంబ్లీలో అధిక సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటినీ ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం కనిపిస్తున్నది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనున్నది.