పాల్వంచ, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్ట్రాంగ్ రూముకు వెళ్లాల్సిన బ్యాలెట్ బాక్సు ఒకటి పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా పాల్వంచలో కలకలం రేపింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లోని 47వ పోలింగ్ బూత్లో వినియోగించేందుకు 157వ నంబర్తో కూడిన ఓ బ్యాలెట్ బాక్సును రిజర్వుగా ఉంచారు. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది తమ సామగ్రిని, బ్యాలెట్ బాక్సులను పోలీసు వాహనంలో పాల్వంచ అనుబోస్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్కు తీసుకెళ్లారు.
సిబ్బంది సదరు వాహనంలో ఖాళీ బ్యాలెట్ బాక్స్ను మరిచిపోయారు. ఆ తరువాత అదే వాహనంలో పోలీసులు పాల్వంచ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆ వాహనంలో బ్యాలెట్ బాక్స్ కన్పించడంతో ఎస్కార్ట్ సిబ్బంది దాన్ని స్టేషన్లో అప్పగించారు. ఖాళీ బ్యాలెట్ బాక్స్ మిస్సయిన విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న పోలింగ్ ఆఫీసర్ శ్రీనివాస్.. వెంటనే పోలీస్స్టేషన్కు వెళ్లి బ్యాలెట్ బాక్సు తీసుకెళ్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆయన అనుచరులు ఈ బాక్సు ఇక్కడికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయం మరింత వ్యాపించడంతో దొంగ ఓట్లు వేశారనే కలకలం మొదలైంది.
ఇంతలో 46, 47వ డివిజన్ల బీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. సీపీఐ, బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్ష నాయకులంతా పోలీస్ స్టేషన్ ఆవరణలో గుమిగూడారు. రేగా కాంతారావు వెళ్లి డీఎస్పీ సతీశ్కుమార్ను ప్రశ్నించగా.. అది ఖాళీ బాక్సు అని, ఎస్కార్ట్ సిబ్బంది దానిని స్ట్రాంగ్ రూముకు తీసుకెళ్లకుండా పొరపాటున పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారని సమాధానమిచ్చారు.