నగర శివారులోని రెండు గుంటల స్థలంలో జీ ప్లస్ 2 కోసం ఓ యజమాని ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా.. లింకు డ్యాకుమెంట్ లేదంటూ ఓ సారి.. భవన డిజైన్ సరిగా లేదంటూ మరోసారి ఇలా నెలకు పైగా ఓ ఫైల్స్ను టౌన్ ప్లానింగ్ అధికారులు పెండింగ్లో పెడుతూ వచ్చారు. ఈ విషయాన్ని యజమాని బల్దియా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా పని కాకపోవడంతో నగరం నడ్డిమధ్యలో ఉన్న ఓ లైసెన్స్ ఇంజినీర్ను సంప్రదించాడు. ఆ మేరకు కాసులు ముట్టజెప్పగానే వారం రోజుల్లోనే అనుమతులు మంజూరయ్యాయి.
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 1 : కరీంనగర్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనులు కావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందేనన్న ప్రచారం జోరుగానే సాగుతున్నది. భవన నిర్మాణ అనుమతులు కావాలంటే ముడుపులు ఇవ్వడం బహిరంగ రహస్యమే అయినా.. ఇటీవల కాలంలో ఈ విభాగం అధికారుల వసూళ్లకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. పలువురు కార్పొరేటర్లు కూడా వీరికి తోడు కావడంతో ముడుపులు దందా జోరుగా సాగుతున్నది. దీనికి తోడుగా పలువురు లైసెన్స్ ఇంజినీర్లతో అధికారులు కుమ్మకై వారి వద్ద నుంచి వచ్చే ఫైల్స్ను మాత్రమే వేగంగా పరిష్కరించి అనుమతులు ఇస్తున్నారని, ఇతరుల నుంచి ఫైల్స్కు సవాలక్ష సాకులు చూపుతున్నారని తెలుస్తోంది. ఓ కీలకాధికారి కేంద్రంగానే ఈ వ్యవహారం నడుస్తుండగా.. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులకు వచ్చిన దరఖాస్తులు తమకు చెందిన ఇంజినీర్ల సైట్ నుంచి వస్తే ఆ మేరకు ఫైల్స్ క్లియర్ చేస్తుండగా.. కొత్త ఇంజినీర్లు, ఇతరుల నుంచి వచ్చే ఫైల్స్కు మాత్రం షాట్ఫాల్స్ పేరుతో తిప్పి పంపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా ఫైల్స్కు సంబంధించి ముడుపులు అందితే తప్ప నిర్మాణ అనుమతి ఫైల్స్ను పరిష్కరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కో భవన నిర్మాణ అనుమతులకు ఏకంగా రూ.50వేలకు పైగా అధికారులకు ముట్టజెప్పాల్సి వస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటితో పాటు నిర్మాణ సమయంలో పక్కవారితో ఏదైనా ఫిర్యాదు వస్తే చాలు ఈ వసూళ్లు దందా మరింతగా పెరిగిపోతుందని తెలుస్తోంది. నిబంధనల మేరకు బల్దియా పరిధిలో 30ఫీట్ల రోడ్లు ఉంటేనే నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సినా అధికారులకు ముడుపులు ఇస్తే 25 ఫీట్ల రోడ్లల్లోనూ నిర్మాణ అనుమతులు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాణిజ్య భవన అనుమతులకు రూ.లక్షలకు పైగా కమీషన్లు వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
టౌన్ ప్లానింగ్లో అనుమతులకే వేలాది రూపాయల ముడుపులు తీసుకుంటున్నారంటూ నగర వాసులు ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్తున్నా ఎవరూ పట్టించు కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆడిందే ఆట అన్నట్లుగా సాగుతున్నది. ఈ విభాగంలోని ఓ కీలకాధికారి కన్నుసన్నల్లోనే ముడుపుల దందా జోరుగా సాగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కీలకాధికారి పరిధిలోకి వచ్చే డివిజన్లల్లో అయితే భారీగానే కమీషన్లు వసూళ్లు చేస్తున్నారని తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ విషయంలో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. ఉన్నతాధికారులు చూసిచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.