న్యూఢిల్లీ, ఆగస్టు 1: సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఎంపిక వెనుక గల కారణాలను వెల్లడించడానికి సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలను ‘చీమలు’ అనే వ్యక్తులు న్యాయవ్యవస్థలోకి ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 2025 నాటి తాజా నిర్ణయంతోసహా పదోన్నతుల సిఫారసులకు సంబంధించిన గత మూడు కొలీజియం తీర్మానాల్లోనూ ఎటువంటి కారణాలు పేర్కొనలేదని జస్టిస్ భుయాన్ అన్నట్లు శనివారం వార్తలు వచ్చాయి.
కారణాలను వెల్లడించకపోవడం వల్ల భవిష్యత్తులో ప్రజా సమూహాలను ‘చీమలు’గా అభివర్ణిచండం వంటి రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తులు న్యాయవ్యవస్థలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించినట్లవుతుంది అని జస్టిస్ భుయాన్ అభిప్రాయపడ్డారు. విధి అనే న్యాయ మేధోమథన సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల జ్యుడీషియల్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ ప్రారంభోత్సవంలో జరిగిన ప్యానెల్ చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం సీజేఐ సూర్యకాంత్ యువతను బొద్దింకలు, పరాన్నజీవులుగా అభివర్ణించినట్లు వెలువడిన వార్తలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆన్లైన్ ఉద్యమం మొదలై, నీట్ పేపర్ లీక్కి వ్యతిరేకంగా ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసనలు నిర్వహించింది.