న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)కు రూ. 1,816.22 కోట్ల నష్టాన్ని చేకూర్చిరని ఆరోపిస్తూ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్(ఆర్సీఎల్), ఆ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ డీ అంబానీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు శనివారం తెలిపారు. అయితే, తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని అనిల్ అంబానీ తరఫున ఆయన ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు. మోసం, నేరపూరిత కుట్ర, ఈపీఎఫ్ఓకు అన్యాయంగా నష్టం కలిగించడం వంటి నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ జూలై 21న చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు.