Balka Suman | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం దగా, వైఫల్యాలు, అన్ని వర్గాల విధ్వంసమే అని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్యాతనపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మిర్యాల రాజిరెడ్డి, TGBKS నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 33 నెలల పాలనలో కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని బాల్క సుమన్ అన్నారు. కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని.. కానీ రాష్ట్రంపై ₹4 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల భారం మోపారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల నిధులతో చెన్నూర్ దూసుకుపోయిందన్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్లలో 9 విడతల్లో వేలాది మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన చెన్నూర్ రెవెన్యూ డివిజన్ను, పారిపెల్లి, అస్నాద్ నూతన మండలాల జీవోలను రాజకీయ కక్షతో మంత్రి కావాలనే అడ్డుకున్నారని బాల్క సుమన్ అన్నారు.
ఎన్నికల్లో చెన్నూర్ యువతకు 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మంత్రి వివేక్ నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. యువతకు 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కానీ, వారి ఇంట్లో మాత్రం మూడు రాజకీయ పదవులు దక్కించుకున్నారని విమర్శించారు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులకు రావాల్సిన ₹12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.