మంచిర్యాల, మార్చి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బాల్క సుమన్సహా బీఆర్ఎస్ నాయకులపై నమోదుచేసిన అక్రమ కేసులో మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరుచేసింది. బాల్క సుమన్తోపాటు బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, దోమకొండ అనిల్, రామిడి లక్ష్మీకాంత్కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినట్టు బాల్క సుమన్ న్యాయవాదులు రవీందర్రావు, మల్లేశ్ గౌడ్ తెలిపారు. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు రెండు ష్యూరిటీలు, మూడు నెలలపాటు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలనే షరతులతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. చెన్నూర్ కోర్టులో క్రైమ్ నంబర్ 37/2026లో బాల్క సుమన్పై పోలీసులు పీటీ వారెంట్ పిటిషన్ వేశారని చెప్పారు.
అది బెయిలబుల్ సెక్షన్ అయినప్పటికీ.. వాదనలు వినిపించేందుకు ప్రాసిక్యూషన్ ఈ నెల 5వ తేదీకి గడువు కోరారని వెల్లడించారు. ఈ నెల 5న ఆ కేసులోనూ బెయిల్ వచ్చాక బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బయటికి వస్తారని తెలిపారు. ఈ కేసులో ఉన్న మిగిలిన బీఆర్ఎస్ నాయకులకు సైతం త్వరలోనే బెయిల్ వస్తుందని చెప్పారు. పీటీ వారెంట్ ఇచ్చిన రోజే ఆ కేసులో బెయిల్ మంజూరు చేయాలని, దురుద్దేశ పూర్వకంగా వాయిదాలు వేయడంపై లోకాయుక్తాలో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని కోర్టు తీర్పుతో మరోసారి రుజువైందని తెలిపారు. బాల్క సుమన్ను బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
చివరి క్షణం వరకు అడ్డుకునే కుట్రలు..
ఈ కేసులో బాల్క సుమన్ జైలు నుంచి బయటికి రాకుండా అడ్డుకునేందుకు సర్కార్ చివరి నిమిషం వరకు ప్రయత్నించింది. మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గత శుక్రవారం బాల్క సుమన్ను కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ను రద్దు చేశారు. దీంతోపాటు పాత కేసుల్లో వేసిన పీటీ వారెంట్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. కస్టడీ పిటిషన్ రద్దయిన నేపథ్యంలో బాల్క సుమన్ బెయిల్ పిటిషన్పై తీర్పును సోమవారం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. బాల్క సుమన్కు బెయిల్ వచ్చే అవకాశాలు ఉండటంతో.. ఆయన జైలు నుంచి బయటికి రాకుండా ఉంచాలన్న తాపత్రయంతో పోలీసులు కొత్త కుట్రలకు తెరలేపారు. కస్టడీ పిటిషన్ను రద్దు చేసిన రోజునే ఆ పిటిషన్పై జిల్లా కోర్టులో అప్పీల్ చేశారు. ఆదివారం సెలవు రోజైనా ఆదిలాబాద్ జైలుకు వెళ్లి బాల్క సుమన్కు నోటీసులు సర్వ్ చేసేందుకు యత్నించారు. తమ అడ్వొకేట్ తీసుకోమంటే తీసుకుంటా లేకపోతే లేదని బాల్క సుమన్ నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు.
పది రోజులుగా కేసు వాదిస్తూ కోర్టులో ప్రాసిక్యూషన్ కండ్ల ముందు ఉంటున్న తమని కాదని వందల కిలోమీటర్ల దూరంలో జైలులో ఉన్న బాల్క సుమన్కు నోటీసులు ఇవ్వడానికి వెళ్లడంపై సుమన్ తరఫు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బెయిల్ రాకుండా చేయాలన్న దురుద్దేశంతోనే గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చెన్నూర్ కోర్టులో గడువు కోరిన మాదిరిగానే, అప్పీల్కు వెళ్లిన పిటిషన్ను ప్రాసిక్యూషన్ గడువు కోరడంతో ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసిందని చెప్పారు. కోర్టులో కస్టడీ పిటిషన్పై అప్పీల్కు వెళ్లినా.. దానిని పరిగణనలోకి తీసుకోకుండా న్యాయస్థానం బాల్క సుమన్కు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఐదో తేదీన మంచిర్యాల జిల్లా కోర్టుతోపాటు చెన్నూర్ కోర్టులోనూ వాదనలు వినిపిస్తామని చెప్పారు. చెన్నూర్ కోర్టులో ఐదో తేదీన బాల్క సుమన్కు బెయిల్ వస్తుందని, అనంతరం ఆయన జైలు నుంచి బయటికి వస్తారని న్యాయవాదులు తెలిపారు.