హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే ‘మోదీ బడే భాయ్.. రేవంత్రెడ్డి ఛోటే భాయ్’ అనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులంతా డమ్మీలేనని, ప్రధాని మోదీ చెప్పినట్టే బీజేపీకి లాభం చేకూర్చేందుకే వారిని బరిలో నిలిపారన్న విషయం స్పష్టమవుతున్నదని పేర్కొన్నా రు.
తెలంగాణ భవన్లో బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ కిషన్రెడ్డి, రేవంత్రెడ్డి అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నారని, కిషన్రెడ్డి గెలుపు కోసమే దానం నాగేందర్ను ఆయనపై పోటీకి నిలిపారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజాపాలన కాదని, నయవంచక పాలన అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ సంపదను ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. మొన్నటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేశారని, నేడు కాంగ్రెస్ అభ్యర్థులను చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని స్పష్టమవుతున్నదని విమర్శించారు. వాటికంటే బీఆర్ఎస్ బలమైనది కావడం వల్లే తమ పార్టీ నేతలను చేర్చుకుని పోటీ చేయిస్తున్నారని ఎద్దేవాచేశారు. తుకుగూడలో సభలో రాహుల్గాంధీతో పచ్చి అబద్ధాలు మాట్లాడించారని పేర్కొన్నారు.
టెట్ ఫీజు తగ్గించాలి
అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వని కాంగ్రెస్ తమ హయాంలో ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను వారే ఇచ్చినట్టు చెప్పుకోవడం చూస్తుంటే మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డే అన్నట్టుందని బాల్క సుమన్ విమర్శించారు. టెట్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేశారు. పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. 25 వేల కోట్లు ఖజానాలో ఉన్నాయని రేవంత్రెడ్డి చెప్పారని, ఆ సొమ్ము కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పొంగులేటి కాంట్రాక్టు సంస్థల ఖాతాలోకి వెళ్లిందని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు ఏదో ఒక లీకులు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నీళ్లు లేక అవస్థలు పడుతుంటే రేవంత్రెడ్డి వీటిని పట్టించుకోకుండా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు, రైతులను పట్టించుకోకుండా కొడంగల్ వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.