మందమర్రి: బీఆర్ఎస్ను కుటుంబ పాలన అని విమర్శించిన ఎమ్మెల్యే వివేక్.. తన కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ప్రశ్నించారు. ఆస్తులను కాపాడుకునేందుకే ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా వివేక్ కుటుంబం పార్టీలు మారుతూ అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గంలోని మందమర్రిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో కలిసి బాల్కసుమన్ ప్రచారం నిర్వహించారు. గత 50 ఏండ్లుగా వివేక్ కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తే ఈ ప్రాంతంలో ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ఆగర్భ శ్రీమంతుడికి, భూగర్భ గని కార్మికుడికి మధ్య జరుగుతున్న పోటీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందరని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తనకు సింగరేణి బొగ్గు కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఎన్నికలు రాగానే వలస పక్షులు వస్తుంటారని, తాము గెలవడానికి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థిది వారసత్వ రాజకీయమని, గత 50 ఏండ్లుగా పదవులు అనువిస్తూ వివేక్ కుటుంబం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వాళ్ల ఆస్తుల రక్షణకు ఎన్ని పార్టీలైనా మారుతారని, ఎన్నికల్లో గెలిస్తే ప్రజల మధ్య ఉండకుడా.. వ్యాపారాలు, పరిశ్రమలు చూసుకుంటూ హైదరాబాద్లో ఉంటారని విమర్శించారు.