హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ధ్యేయం తెలంగాణ రాష్ట్ర వికాసమైతే, ఆ వికాసాన్ని విధ్వంసం చేయటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. తమకు అనుకూలంగా లేకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆంధ్రానేతలకు ఊడిగం చేస్తే.. ప్రస్తుతం బీజేపీ నేతలు గుజరాత్ నేతలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను సుమన్ తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేపడితే, ఆ చెరువు కట్టలను కూల్చడానికా బుల్డోజర్లు తెచ్చేది? అని ప్రశ్నించారు. ఉత్తర భారతంలో బీజేపీ దండు చేసిన ఆకృత్యాలను ఇక్కడ చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. బీజేపీ నేతలు తెచ్చే బుల్డోజర్లతో ప్రజలను చంపుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ ధ్వంస రచనపై రాష్ట్రంలోని మేధావులు, బుద్ధిజీవులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతల తాటాకు చప్పుళ్లకు తెలంగాణ బెదిరేది కాదని తేల్చిచెప్పారు. తెలంగాణకు ద్రోహం చేయాలని తలచిన కాంగ్రెస్, టీడీపీకి ఏ గతి పట్టిందో, బీజేపీకీ అదే గతి పడుతుందని హెచ్చరించారు. కత్తి ఇచ్చేది మోదీ, అమిత్షా అయితే, తెలంగాణ ప్రజలను పొడిచేది ఇక్కడి బీజేపీ నేతలేనని మండిపడ్డారు. హైదరాబాద్ను వదిలి అహ్మదాబాద్ను పెద్ద చేయాలనేదే బీజేపీ సిద్ధాంతమన్నారు. బీజేపీ ఎత్తులను తెలంగాణ ప్రజలు చిత్తు చేస్తారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యంపై బీజేపీ నేతలు నీచంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
రాష్ర్టానికి కేంద్రం ఏమీ చేయటం లేదనే విషయం అసెంబ్లీ సాక్షిగా బయటపడుతుందని తెలిసే బీజేపీ ఎమ్మెల్యేలు పథకం ప్రకారం లొల్లి చేసి సభ నుంచి బహిష్కరణకు గురయ్యారని సుమన్ విమర్శించారు. తప్పును కప్పి పుచ్చుకోవటానికే దీక్షల నాటకమాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ దీక్షలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని ఎద్దేవాచేశారు. రాష్ట్రంపై ప్రేమ, ప్రజాస్వామ్యంపై గౌరవముంటే బీజేపీ నేతలు ఢిల్లీలోని జంతర్మంతర్లో దీక్ష చేయాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో దీక్ష చేయటాన్ని బాల్క సుమన్ తప్పుబట్టారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్లో ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ఫ్యాక్టరీ కోసం బీజేపీ నేతలు కేంద్రాన్ని నిలదీస్తూ దీక్ష చేయాలని సూచించారు.