హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రానున్న రోజుల్లో దేశంలో టీఆర్ఎస్ జైత్రయాత్ర చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ అంతిమయాత్ర కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దేశంలో బీజేపీ అప్రజాస్వామికంగా ఎన్ని చర్యలకు పాల్పడుతున్నా.. పోరాటం చేసే స్థితిలో కాంగ్రెస్ లేదని.. బీజేపీకి ఆ పార్టీ లొంగిపోయినట్టుగా ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు టీ భానుప్రసాద్రావు, దండే విఠల్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కొత్త జాతీయపార్టీ అనగానే ఆ రెండు జాతీయ పార్టీల్లో వణుకు మొదలైందని తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇస్తే కాంగ్రెస్లో ఉలుకు పలుకు లేదని, దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకులకు ఈడీ నోటీసులంటూ బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడినా కూడా వాటిని ప్రతిఘటించే పరిస్థితి, నిరసన చెప్పే స్థితి లేదన్నారు.
రాహుల్గాంధీ మీద అస్సాం ముఖ్యమంత్రి కుసంస్కారంగా మాట్లాడినా కూడా కనీస స్పందన లేదని ఎద్దేవాచేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టినా, రాజస్థాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించినా బీజేపీపై పోరాటం చేసే పరిస్థితి కాంగ్రెస్కు లేనే లేదని చెప్పారు. కాంగ్రెస్ ఐసీయూపై ఉన్నదని, రేపో, మాపో అన్నట్లుగా ఆ పార్టీ తయారైందన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీలో తుగ్లక్ పాలన.. గల్లీలో తుగ్లక్ వాదన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ స్థాపించే జాతీయపార్టీ ద్వారా బీజేపీ ఉన్మాదాన్ని, దుర్మార్గాలను దేశ ప్రజల ముందు పెడతామని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసిందని, రాష్ట్రాల హక్కులను హరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో దేశం మరో పోరాటానికి సిద్ధ పడుతుందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందే విభజన హామీలు అమలుచేయాలని సుమన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చెప్తామని, ఇక్కడి గుణాత్మక మార్పులను దేశప్రజలకు వివరిస్తామని తెలిపారు నయా భారత్ కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
వారికి కుల గజ్జి.. మత పిచ్చి..
కులగజ్జి రేవంత్, మత పిచ్చి సంజయ్కి సీఎం కేసీఆర్పై మాట్లాడే అర్హత లేదని బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ కాదని, ప్రాణం పోసే సంజీవని అని అన్నారు. జాతీయ రాజకీయాలపై తమ పార్టీలో చర్చ జరిగితే జీర్ణించుకోలేని స్థితిలో ఆ పార్టీలు ఉన్నాయన్నారు. తాము చర్చిస్తే జాతీయ పార్టీల్లో వణుకు మొదలైందని, దేశాన్ని గట్టెకించేది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితిలో లేదని, బీజేపీకి కాంగ్రెస్ భయపడుతున్నదని ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్రావు అన్నారు. దేశంలో నియంత పాలన కొనసాగుతుందని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం నుంచి ప్రశ్నించే గొంతు లేదని, దేశ భవిష్యత్తు కోసం కేసీఆర్ ముందుకు వస్తున్నారని అన్నారు.