హైదరాబాద్ : రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం బీజేపీకి కొట్టిన పిండేనని, ఆ పార్టీ విష సంస్కృతిలో ఇదంతా భాగమేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తనయుడిపై చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వాడిన జుగుప్సాకరమైన భాషను ఖండిస్తున్నానన్నారు. బండి సంజయ్ ఏం చెబితే అది నవీన్ చేస్తాడని, చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎత్తుగడ వేసిందని, తెలంగాణలో ఇప్పుడదే చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ సమాజం బీజేపీ తీరును గమనించాలని విజ్ఞప్తి చేశారు.
తమ సహనానికి, సంయమనానికి ఒక హద్దు ఉంటుందని, తీన్మార్ మల్లన్నకు రెండు చెంప దెబ్బలు చెప్పు దెబ్బలు కావాలన్నారు. మహిళలను, కుటుంబ సభ్యులను బీజేపీ కించపరుస్తోందని, ఈ ధోరణి బీజేపీకి మంచిది కాదన్నారు. తన ఆస్తులపై కూడా బీజేపీ సోషల్ మీడియాలో విష ప్రచారం నడుస్తోందని, ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న దానికన్నా ఎక్కువ ఆస్తులు ఉంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి రాసిస్తానన్నారు.
ఇలాంటి విష ప్రచారం చేస్తుంటే పోలీసు విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మేం చాలా సందర్భాల్లో డీజీపీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశామని, పోలీసులు చర్యలు తీసుకోకుంటే మా కార్యకర్తలు స్పందిస్తారన్నారు. పోలీసులు సుమోటోగా కేసులు ఎందుకు నమోదు చేయరని ప్రశ్నించారు. ఇప్పటికైనా డీజీపీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలని, మంత్రులపై అసభ్య ప్రచారం జరుగుతుంటే స్పందించాలన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగంపై దీక్షా చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే మోడీ ఏం చేస్తున్నారు.. గడ్డి పీకుతున్నారా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 8.72 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయరా? అన్నారు. జాతీయ స్థాయి నిరుద్యోగ రేటుతో పోలిస్తే రాష్ట్ర స్థాయి నిరుద్యోగ రేటు చాలా తక్కువని, పార్లమెంట్లో తెలంగాణ నిరుద్యోగ రేటు తక్కువ అని కేంద్రం చెప్పిందని, ఈ విషయం సంజయ్కి తెలియదా అన్నారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలపై బహిరంగ లేఖ విడుదల చేశారు. దమ్ముంటే బండి సంజయ్ కేంద్ర ఉద్యోగాలపై శ్వేత పత్రం ఇప్పిస్తారా ? అని ప్రశ్నించారు. 36 ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు.
హైదరాబాద్కు రావాల్సిన ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేశారో మోదీని నిలదీసే దమ్ము సంజయ్కి ఉందా? అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయలేదని, ఏర్పాటు చేస్తే ఉద్యోగాల సృష్టి జరిగేదా? లేదా? అన్నారు. తెలంగాణ ఖ్యాతిని తక్కువ చేసి చూపే కుట్ర బీజేపీ నేతలదని, సింగరేణిని కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్న కేంద్రప్రభుత్వాన్ని బండి సంజయ్ ఎందుకు నిలదీయరన్నారు. సింగరేణికి వెళ్లే దమ్ము బీజేపీ నేతలకుందా.. బీజేపీ నేతలకు చీము నెత్తురు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇప్పించాలన్నారు. రైతుల విషయంలో రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే రైతు చట్టాలను రద్దు చేయడం రాజకీయం కాదా అని ప్రశ్నించారు. బండి నిరుద్యోగ దీక్ష చేసే ముందు తాము అడిగి ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీపై పోరాటంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మీడియాలో స్పేస్ కోసమే కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారన్నారు. రేవంత్కు నెత్తి లేదు.. కత్తి లేదన్నారు. దేశ సమస్యలపై రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎందుకు నిరాహార దీక్ష చేయరో చెప్పాలన్నారు. ఏం చేసినా కాంగ్రెస్ లేచి నిలబడే పరిస్థితి లేదని, టీఆర్ఎస్ ఎంపీలు అన్ని అంశాలపై ఢిల్లీలో గట్టిగా కొట్లాడారన్నారు. కాంగ్రెస్ ఎంపీలకు టీఆర్ఎస్ను విమర్శించే హక్కు లేదన్నారు.