హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ అకౌంట్ నుంచి రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ కంపెనీకి రూ.8 కోట్లు బదిలీ చేశారని, ఆ నిధులతో ఓటర్లను, బీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఆరోపించారు. వివేక్ కంపెనీ నుంచి ఇంకా నిధులు బదిలీ చేసే అవకాశం ఉన్నదని, దీనిపై వెంటనే విచారణ చేసి బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని కోరారు.
బుధవారం ఆయన హైదరాబాద్లోని బూర్గుల రామకృష్ణారావు భవన్లో సీఈవో వికాస్రాజ్ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిధుల బదిలీపై ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్లుగా వివేక్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులే ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలోని పలువురు వ్యాపారులకు బ్యాంకు అకౌంట్ నుంచి నిధులు బదిలీ చేసి వారి దగ్గర నగదు తీసుకోవడానికి వివేక్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇందుకు సహకరించవద్దని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. వివేక్ కుటుంబ సభ్యులతోపాటు వెలుగు దినపత్రిక, వీ6 చానల్ సిబ్బంది మొత్తం చెన్నూరు నియోజకవర్గంలోనే పనిచేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వివేక్కు సవాల్ చేశారు. అంగీలు మార్చినట్టుగా పార్టీలు మార్చే వివేక్కు నీతి, నిజాయతీ, నిబద్ధత అంటూ ఏమీ ఉండవని విమర్శించారు. బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి ఆ పార్టీకి ద్రోహం చేశారని దుయ్యబట్టారు.
వివేక్ తన తండ్రినే సరిగా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల నిధులు తెచ్చిన చరిత్ర తనదని, ఎన్నికల్లో గెలవడానికి కోట్లు తీసుకొస్తున్న చరిత్ర వివేక్ది అని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్కుమార్, టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి కే రమేశ్రెడ్డి పాల్గొన్నారు.