హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ సభ చూసినోళ్లంతా.. ‘చంపినోళ్లే సంతాప సభ పెట్టినట్టుంది’ అని మాట్లాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఆదివాసీలకు రేవంత్తో కాకుండా.. సోనియా, రాహుల్, ఖర్గేలతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మాట్లాడారు.
కండ్లుండీ ఆదిలాబాద్ అభివృద్ధిని చూడలేని కబోది సీఎం రేవంత్ అని ఎద్దేవా చేశారు. విష జ్వరాలతో బాధపడే గిరిజనులకు సీఎంగా కేసీఆర్ వైద్య సదుపాయాలు కల్పించి, బిడ్డలకు గురుకులాలు పెట్టించారని గుర్తుచేశారు. ఎవరు ఎవర్ని కలుస్తున్నారు? ఎవరు బేర సారాలు చేస్తున్నారు? అనేది ప్రజలకు తెలుసుసని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ల నుంచి పదవీగండం ఉండటంతో రేవంత్లో అభద్రత పెరిగిపోయిందని తెలిపారు.
కేసీఆర్ హయంలో రూ.7 వేల కోట్లు రైతుబంధు కోసం ఉంచితే.. రేవంత్ రాగానే వాటిని కాంగ్రెస్ నేతకు చెంది న రాఘవ కన్స్ట్రక్షన్కు బదిలీ చేశారని విమర్శించారు. రేవంత్ రాకతో తెలంగాణలో రాక్ష స రాజ్యం మొదలైందని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు.
ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పార్లమెంటు ఎన్నికల్లోపే అమ లు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మం త్రి జోగు రామన్న మాట్లాడుతూ.. రేవంత్ ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనకు వచ్చింది కేవలం ఓట్ల కోసమేనని విమర్శించారు. ఓటు కు నోటు కేసులో దొరికిన రేవంత్.. ఎంపీల అమ్మకం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఇంద్రవెల్లిలో వందల మంది ఆదివాసీలను పొట్టన బెట్టుకున్నదే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. రేవంత్కు ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని తాకే హకే లేదని స్పష్టంచేశారు. ప్రజా సంఘాల ఒత్తిడితో నిర్మించిన స్థూపం వద్దకు.. గద్దర్ను సైతం కాంగ్రెస్ నాయకులు వెళ్లనివ్వలేదని చెప్పారు.
కేసీఆర్ సీఎం అయ్యాకే స్థూపం దగ్గరకు వెళ్లే స్వేచ్ఛ అందరికీ దొరికిందని గుర్తుచేశారు. నాగోబా దేవాలయానికి కేసీఆర్ ప్రభు త్వం నిధులు ఇస్తే.. రేవంత్ ప్రారంభోత్సవా లు చేశారని పేర్కొన్నారు. జోడేఘాట్ను రూ.22 కోట్లతో కేసీఆర్ అభివృద్ధి చేశారని వెల్లడించారు. గిరి వికాసం కింద 3 వేలకుపైగా వ్యవసాయ బోర్లను గిరిజనులకు అందజేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని, కేసీఆర్ హయాంలో 13 మధ్యతరహా ప్రాజెక్టులను రూ.800 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు.
ఇకనైనా కారుకూతలు బంద్వెట్టాలి: భరత్
ఇకనైనా సీఎం రేవంత్, మంత్రులు కారుకూతలు మానుకొని.. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కోరారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ కేంద్రం వద్ద జీ హుజూర్ అన్నది కాబట్టే మన ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించారని తెలిపారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్నాయక్ డిమాండ్ చేశారు. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయని, రైల్వేలో త్రీవ అన్యా యం జరిగిందని, 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలపై కాంగ్రెస్ స్పందించాలని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.